‘తమ్మిలేరు’ తగాదా

‘తమ్మిలేరు’ తగాదా

 చింతలపూడి: తమ్మిలేరు రిజర్వాయర్‌లో కొన్నేళ్లుగా అనధికారికంగా రొయ్యల సాగు చేస్తుండటం వివాదాలకు తావిస్తోంది. ప్రాజెక్టుపై రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరగడంతో దళారులు మత్స్యకారుల నోళ్లు మూయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మత్స్యకారుల సంఘాల మధ్య వివాదం చోటు చేసుకుంటోంది. నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు ప్రాజెక్టు, కృష్ణాజిల్లా మంకొల్లు వద్ద నిర్మించిన గోనెలవాగులో గతేడాది సెప్టెంబర్‌లో అనధికారికంగా రొయ్య పిల్లలను వేశారు. ఇప్పుడు వాటిని పట్టి అమ్ముకునే విషయంలో వివాదం తలెత్తింది. ప్రాజెక్టులో రొయ్య పిల్లలను మేము వేశామంటే, మేము వేశామని పట్టిన రొయ్యలు మాకే అమ్మాలని రెండు జిల్లాలకు చెందిన వ్యాపారులు వివాదాన్ని రగిల్చారు. దీంతో  ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రొయ్యల వేటను నిషేధిస్తూ కృష్ణాజిల్లా చాట్రాయి తహసీల్దార్‌ 144 సెక‌్షన్‌ను విధించారు. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడి బతుకుతున్న సుమారు 400 మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. 

 

దళారుల కన్ను

మత్స్యశాఖ ఏటా తమ్మిలేరులో చేప పిల్లలను వేసి, అవి పెరిగాక వాటిని మత్స్యకారులు పట్టుకుని అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. అయితే రొయ్యల సాగు ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుండటంతో రెండు జిల్లాలకు చెందిన దళారుల కన్ను ప్రాజెక్టుపై పడింది. రాజకీయ పలుకుబడితో ఏటా జలాశయంలో రొయ్యలు పెంచుతూ వాటిని ఎగుమతి చేసి కోట్లు గడిస్తున్నారు. ఇందుకోసం మత్స్యకార సంఘాలతో ముందుగానే ఒప్పందం చేసుకుని పట్టిన రొయ్యలను తమకే విక్రయించాలని నిబంధన విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పట్టిన రొయ్యలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారి ప్రయత్నించడంతో మత్స్యకారులు గిట్టదని చెప్పడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానిక మత్స్యకారులు విషయాన్ని మంత్రి పీతల సుజాత దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాలతో జిల్లాకు చెందిన మత్స్యశాఖ డీడీ ఎం.యాకూబ్‌పాష, తహసీల్దార్‌ టి. మైఖేల్‌రాజ్‌ గత శనివారం ప్రాజెక్టును పరిశీలించారు. మత్స్యకార సంఘాలతో సంప్రదింపులు జరిపారు. త్వరలోనే రెండు జిల్లాల అధికారులు, మత్స్యకార సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అప్పటి వరకు రొయ్యల వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. 

 

రొయ్యల సాగు నిషేధం 

తమ్మిలేరు ప్రాజెక్టులో రొయ్యల సాగు నిషేధం. అయినా దళారులు ఏటా రొయ్య పిల్లలను జలాశయంలో వేసి పెంచడం, పట్టుకుని అమ్మడం చేస్తున్నారు. ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం తమ్మిలేరు ప్రాజెక్టుపై రూ.10 కోట్లతో తాగునీటి పథకం నిర్మిస్తోంది. దీని ద్వారా చింతలపూడి, ప్రగడవరం పంచాయతీలకు తాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టులో రొయ్యల సాగు చేపడితే నీరు కలుషితమై తాగడానికి పనికిరావని అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సీహెచ్‌ అమరేశ్వరరావును వివరణ కోరగా తమ్మిలేరులో రొయ్యల సాగు చేస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నామని, విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top