గొంతులో మాత్ర అడ్డుపడి బాలుడి మృతి
పినపాక:
మూడేళ్ల బాలుడి గొంతులో ట్యాబ్లెట్ అడ్డుపడటంతో మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పినపాక పంచాయతీ తోగ్గూడెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..చిట్టిమళ్ళ సతీష్, సంధ్య రెండో సంతానం నర్సింహాచారి (3). నులిపురుగుల నివారణకు బాలుడి తల్లి పెద్ద ట్యాబ్లెట్ను ముక్కలు చేసి అందులో ఓ ముక్కను బాలుడి నోట్లో వేసింది. ఆ ట్యాబ్లెట్ గొంతులో అడ్డుపడటంతో ఊపిరాడక బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. మొహం పచ్చగా మారింది. పొట్ట బాగా ఉబ్బింది. కంగారుపడిన బాలుడి తల్లిదండ్రులు వెంటనే సీతంపేటలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కుమారుని మరణంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. చేతులారా చప్పుకున్నామని.. ట్యాబ్లెట్ వేయకపోయినా బాగుండేదని బాలుడి తల్లి సంధ్య విలపించిన తీరు కంటతడి పెట్టించింది.
అవగాహన లేమే కారణం
-
నులిపురుగుల నివారణలో భాగంగా నాలుగేళ్ల లోపు పిల్లలకు ట్యాబ్లెట్ ఇవ్వకూడదు. టానిక్ మాత్రమే పోయాలి. కానీ అవగాహన లేమి ప్రాణాల మీదకు తెచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహించడం వల్లనే బాలుని ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రాథమిక వైద్యంపేరుతో 104 వాహనం ద్వారా గ్రామాల్లో జలుబు, దగ్గు, బీపీ, షుగర్ తదితర వ్యాధులకు ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. వారం రోజుల క్రితం తోగ్గూడెం వచ్చిన 104 వాహనం వైద్య సిబ్బంది నుంచి బాలుడి తల్లి సంధ్య నులిపురుగుల నివారణ మాత్రను తీసుకుంది. ఆ ట్యాబ్లెటే బాలుడి ప్రాణాలను బలిగొంది.