రామయ్యకు ఘనంగా స్వర్ణ పుష్పార్చన
-
నేడు సప్తాహమునకు పూర్ణాహుతి
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి ఆదివారం ఘనంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నదీ నుంచి తీర్థ జలాలు తీసుకుని వచ్చి అంతరాలయంలో స్వామి వారికి అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారికి 108 స్వర్ణ పుష్పాలతో అర్చన, అష్టోత్తర శతనామార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వేద పండితులు రామయ్యకు అత్యంత వైభవోపేతంగా నిత్యకల్యాణం చేశారు. అర్చకులు స్వామి వారి శేషవస్త్రాలు, తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దొరికిన ఆభరణాలతో అలంకరణ
భద్రాచలం రామాలయంలో అమ్మవారికి మంగళసూత్రాలు, లక్ష్మణ స్వామి లాకెటు మాయమై వారం రోజుల హైడ్రామా అనంతరం శనివారం దొరకడంతో వాటిని ఆదివారం స్వామి వారి నిత్యకల్యాణంలో అలంకరించి స్వామి వారికి నిత్యకల్యాణం నిర్వహించారు.
నేడు సప్తాహంకు పూర్ణాహుతి
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమద్భాగవత సప్తాహములో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విని తరిస్తున్నారు. దానిలో భాగంగా ఆదివారం 7వ రోజు ఉదయం 6 నుంచి 7.30 వరకు ఆరాధన, సేవాకాలం, శాత్తుమొరై. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు గోపూజ, చతుఃస్థానార్చన, దశమస్కంధ హోమము, 10వ స్కంధములో 43వ అధ్యాయం నుంచి పూర్తి పారాయణము, నిత్య పూర్ణాహుతి, తీర్ధ–ప్రసాద వినియోగము. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీమద్భాగవత ప్రవచనము. రాత్రి 8 నుంచి 8.15 వరకు మంగళాశాసనము, తీర్ధ–ప్రసాద వినియోగము, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కాగా సప్తాహం వేడుకలకు సోమవారంతో ముగియనున్నాయి. పూర్ణాహుతి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.