‘పట్టు’కు సన్‌ స్ట్రోక్‌

‘పట్టు’కు సన్‌ స్ట్రోక్‌


- ఎండవేడిమికి తగ్గుతున్న పట్టుగూళ్లు దిగుబడి

- చనిపోతున్న పాలపురుగులు

- ధరలు ఉన్నా చేతికందని వైనం




హిందూపురం అర్బన్‌ : ఎండ మండిపోతున్నాయి. వడగాల్పులకు పట్టుపురుగులు విలవిలలాడి చనిపోతున్నాయి. పట్టుగూళ్లపంటను సంక్షించుకోవడానికి రైతులు నానాతంటలు పడుతున్నా.. నాణ్యత తగ్గి దిగుబడిపై బలమైన ప్రభావం చూపుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పట్టుగూళ్ల మార్కెట్‌లో ఒక్కటైన హిందూపురం మార్కెట్‌కు స్థానికంగానే కాక ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పట్టుగూళ్లు తీసుకువస్తున్నారు. సాధారణంగా ప్రతిరోజు సుమారు ఆరు టన్నుల వరకు çపట్టుగూళ్ల దిగుమతి అయ్యేవి. అయితే మండుతున్న ఎండల కారణంగా నాణ్యత, దిగుబడి తగ్గిపోయి మార్కెట్‌కు దిగుమతి సాగానికి పడిపోయింది. అయితే రైతులకు మాత్రం ఆశించిన ధరలు కనిపిస్తున్నా దిగుబడి బాగా తగ్గిపోయింది. బైవోల్టిన్‌ రూ.450  నుంచి రూ.530 వరకు ధర పలుకుతుండగా సీబీరకం గూళ్లకు రూ.360 నుంచి రూ.400 పలుకుతున్నాయి. గూళ్లకు మంచి ధరలు కనిపిస్తున్నా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతూ తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



వేడిధాటికి చనిపోతున్న పాలపురుగులు :

వేసవిలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతకు పట్టుపరుగులు పాలపురుగుల దశలోనే చనిపోతున్నాయి. పట్టుగూళ్ల పెరుగుదలకు 24, 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. అయితే ప్రస్తుతం 40డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోతుండటంతో పట్టురైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టుçపురుగులను కాపాడుకోవడానికి షెడ్లపై స్పింకర్లతో నీటిని చిమ్మిస్తున్నారు. అలాగే షేడ్ల చుట్టు టెంకాయ, గోనేసంచులను వేలాడదీసి నీటితో తడిపి గూళ్లకు చల్లదనం అందించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా వేడిమి తగ్గడం లేదని దీనివల్ల దిగుబడిపై ప్రభావం చూపుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాక ఎండకు పురుగులు కూడా ఆకులు తినలేకపోతున్నాయి. వేడికి ఆకులు కూడా ఎండిపోతుండటంతో పట్టుపురుగులు ఎండుతున్న ఆకుల్ని తినకుండా వదిలేస్తున్నాయి. ఫలితంగా వీటిప్రభావం దిగుబడిపై చూపుతోంది.



ఎండకు పురుగులు మేయడం లేదు  

ఎండలు బాగా ఎక్కువయ్యాయి పట్టుపురుగులు ఎదగడంలేదు. పాలపురుగులు ఆకులు మేయకుండా నిలిచిపోతున్నాయి. దీంతో పట్టుగూడు బలహీనంగా మారిచిన్నగా మారుతోంది. మార్కెట్‌లో ఇలాంటి గూళ్లకు డిమాండ్‌ తగ్గి రేటు పలకడం లేదు. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు.

- కేశవ, వర్థనపేట



ప్రభుత్వం ఆదుకోవాలి

పట్టుగూళ్ల షెడ్లకు చల్లదనం కోసం నీటితడి అందించేందుకు చాలా ఖర్చు అవుతోంది. దీనివల్ల పెట్టుబడి పెరిగిపోతుంది. మార్కెట్‌కు రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ధరలున్నా పెట్టుబడికి సరిపోవడం లేదు. దీనివల్ల పట్టుగూళ్ల రైతులు చాలా నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం నీటితడి ఇచ్చేందుకు సబ్సిడీ అందించాలి.

–రంగనాథప్ప, గుడిబండ

 

మార్కెట్‌కు దిగుబడి బాగా తగ్గిపోయింది

రెండు నెలలుగా మార్కెట్‌కు వస్తున్న పట్టుగూళ్లు చాలా తగ్గిపోయాయి. రైతులు తీసుకువస్తున్న గూళ్లు ఎండధాటికి ఎర్ర, నల్లబారిపోతున్నాయి. దీనివల్ల రేటు తగ్గిపోతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి ధరలు ఉన్నాయి. అయితే రైతులకు వస్తున్న నష్టాలకు సరిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇస్తున్న సబ్సిడీల్లో మాత్రం ఏం కోతలు లేవు.

- రామకృష్ణారెడ్డి, మార్కెట్‌ అధికారి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top