ఆకలి కేకలు
అరకొర భోజనంతో అవస్థలు
నిర్వాహకుల తీరుపై విద్యార్థుల ఆందోళన
తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన
సీతానగరం: అరకొర భోజనంతో ఎన్నాళ్లు అవస్థలు పడాలి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో రోజులుగా ఇదే సమస్య. ఇక కడుపుమండిన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇదీ బూర్జ ఉన్నత పాఠశాలలో శనివారం చోటు చేసుకున్న సంఘటన. ఈ పాఠశాలలో లక్ష్మీపురం, చెల్లంనాయుడువలస, బూర్జ, పెదంకలాం, కష్ణారాయపురం గ్రామాలకు చెందిన 408 మంది విద్యనభ్యసిస్తున్నారు. శనివారం ఉదయం పాఠశాలకు 354 విద్యార్థులు హాజరయ్యారు. అందులో 287 మందికి మధ్యాహ్న భోజనం పెట్టడానికి 40 కేజీల బియ్యం నిర్వాహకులకు ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నం పెట్టే సమయంలో వంటగదికి వెళ్ళిన విద్యార్థులు అన్నం లేదని చెప్పడంతో ఆకలితో ఉన్న 25 మంది విద్యార్థులు స్కూలు మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కె.సూర్యనారాయణ ఇంటికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఆయన సూచన మేరకు మీడియా మిత్రులకు సమాచారం అందించారు. నెలలతరబడి ఇబ్బందులు పెడుతున్న హెడ్మాస్టర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జోక్యం చేసుకున్న ఎస్ఐ, తహసీల్దార్ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.