డిష్ పిన్ తాకి విద్యార్థి మృతి
పెనుకొండ : మండలంలోని తిమ్మాపురంలో డిష్ పిన్ తాకి గొల్ల శ్రీకాంత్(16) అనే విద్యార్థి శనివారం మృతి చెందినట్లు పోలీస్స్టేషన్ హౌస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన అతను, ప్రస్తుతం సెలవులు కావడంతో కుటుంబ సభ్యులకు తోడుగా ఇంట్లో పనులు చేసుకునేవాడు.
ఉగాదిని పురస్కరించుకుని ఇల్లు కడుగుతూ టీవీని పక్కకు జరిపే ప్రయత్నంలో దాని డిష్పిన్ తొలగించేందుకు ప్రయత్నించడంతో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.