సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
- ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకుల హెచ్చరిక
- ఆర్ఎం కార్యాలయం ముట్టడి
కర్నూలు(రాజ్విహార్): ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటన్న సమస్యలపై ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని నేషషన్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు డి. సూర్య ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు మధుసూదన్ అన్నారు. ఇదే పరిస్తితి కొనసాగితే సమ్మె తప్పదని హెచ్చరించారు. కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కర్నూలు కొత్త బస్టాండ్లో 500మందితో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రీజినల్ మేనేజరు కార్యాలయం వద్ద బైఠాయించారు. యాజమాన్య, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు యాజమాన్యం నిర్ణయాల కారణంగా సంస్థ నిర్వీర్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2013 ఏప్రిల్ 1 నుంచి 2015 జూన్ 30 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్యాట్యూటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్యారేజీల్లోని ఖాళీ పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని, అర్హతను బట్టి పదోన్నతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రీజియన్ అధ్యక్షుడు షఫీవుల్లా, సంయుక్త కార్యదర్శి దేవసహాయం, నాయకులు మద్దయ్య, ఇసాక్, ఫకృద్దీన్, 12డిపోల కార్యదర్శులు పాల్గొన్నారు.