ఆ రెండూ ఇచ్చి తీరాల్సిందే
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. రకరకాల సాకులు చూపి తప్పించుకోవాలని అనుకుంటోంది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు ప్రత్యేక హోదా కూడా అంతే ముఖ్యం. అలాంటిది పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగేందుకు టీడీపీ సర్కారు వెనకాడుతోంది.
విభజన సందర్భంగా వేరుపడుతున్న ఆంధ్రప్రదేశ్ను అనేక విధాలా ఆదుకుంటామని రెండు రకాల హామీలను అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి హామీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వివిధ సంస్థలు ఏర్పాటు చేస్తామని పునర్విభజన బిల్లులోనే పొందుపరిచారు. రెండో హామీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరడంలో ఇప్పుడు ప్రభుత్వం విఫలమవుతోంది.
రెండు హామీలు ప్రభుత్వం ఇచ్చిందన్న సంగతిని పక్కనపెట్టి ఏదో ఒకటి వస్తోంది కదా అని టీడీపీ ప్రభుత్వం రాజీపడుతోంది. ప్యాకేజీ వస్తుంది కదా అని ప్రత్యేక హోదాను పక్కన పెడుతోంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు చేసిన తీవ్ర అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్యాకేజీతో పాటు హోదా ఇచ్చి తీరాల్సిందే. చట్టంలో పొందుపరిచిన అంశాలకు ఎంత ప్రాధాన్యం ఉందో, చట్టసభలో ఇచ్చిన మాటకు అంతే విలువ ఉంటుందనే విషయాన్ని విస్మరిస్తోంది.
మరోవైపు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన సంస్థల ఏర్పాటును టీడీపీ గొప్పగా చెప్పుకుంటోంది. ప్యాకేజీ గురించి పదేపదే ప్రస్తావిస్తూ టీడీపీ పెద్దలు ప్రత్యేక హోదాను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ప్యాకేజీ వస్తుంటే ప్రత్యేకహోదా అవసరమేంటని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రత్యేకహోదా సంజీవిని కాదని చిలుక పలుకులు వల్లిస్తున్నారు. పైపెచ్చు హోదా విషయంలో... కోడలు మగబిడ్డ కంటానంటే అత్త అమ్మాయిని కనాలని ప్రాధేయపడుతుందా? అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా వివిధ సంస్థల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ సాయమన్నది చట్టంలోనే పొందుపరిస్తే... దీన్ని తామేదో సాధించినట్టు టీడీపీ ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకుంటోంది. ప్యాకేజీ రూపంలో వస్తున్నది కేంద్రం చట్టబద్ధంగా ఇచ్చిన హామీ అనే విషయాన్ని మరుగుపరిచేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. తమ ప్రయత్నాల వల్లే నిధులు, వివిధ సంస్థల ఏర్పాటు జరుగుతోందని టీడీపీ నేతలు బాకా ఊదుతున్నారు.
ఇక ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తాము అధికారంలోకి వస్తే.. ఐదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు కలిసి ఇచ్చిన హామీని ఈరోజు ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇదేనా పార్లమెంటు విశ్వసనీయత? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటికీ అయోమయం పోలేదు. దీనివల్ల బాధతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో అయోమయానికి గురి చేస్తున్నారు.
రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కు అప్పటి ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు ఇవీ..
* 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి - రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కలుపుకొని ఐదేళ్ల పాటు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పిస్తారు. దీని వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
* బిల్లులో ఇప్పటికే పొందుపరచిన విధంగా కేంద్ర ప్రభుత్వం తగిన రీతిలో ద్రవ్య పరమైన చర్యలు తీసుకుంటుంది. రెండు రాష్ట్రాలలోను పారిశ్రామీకరణ, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే విధంగా పన్ను ప్రోత్సాహకాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాలలో అమలులో ఉన్నట్లుగానే ఈ ప్రొత్సాహకాలు ఉంటాయి.
* పోలవరం ప్రాజెక్ట్ కోసం సహాయ, పునరావాసం పూర్తి స్థాయిలో, సాఫీగా సాగేందుకు అవసరమైతే మరిన్ని సవరణలు అదికూడా సాధ్యమైనంత త్వరగా చేయడం జరుగుతుందని గౌరవ సభ్యులకు నేను మరోసారి మాట ఇస్తున్నా. మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపడుతుంది. ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదు.
* కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి ఏడాది ఏర్పాడే వనరుల వ్యత్యాసాన్ని, ముఖ్యంగా ఆ రాష్ట్ర ఆవిర్భావ దినం నుంచి 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను ఆమోదించే మధ్య కాలంలో లోటును కేంద్ర ప్రభుత్వం 2014-15 రెగ్యులర్ బడ్జెట్ ద్వారా పూడుస్తుంది.
ప్రత్యేక హోదా -ఏపీకి కలిగే ప్రయోజనాలు
కేంద్ర గ్రాంట్లు
- సాధారణంగా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు 30 శాతానికి మించి ఉండవు. అంటే ఏ పథకం, కార్యక్రమం చేపట్టినా.. కేంద్రం గ్రాంట్ పోనూ మిగతా 70 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
- అదే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్ 90 శాతం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 శాతం భరిస్తే చాలు.
- ఒకవేళ ఆ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోలేని పరిస్థితి ఉంటే.. అప్పుడు కూడా కేంద్రమే సమకూరుస్తుంది.
- కేంద్రం గ్రాంట్గా ఇచ్చే ఏ నిధి కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
- సత్వర సాగునీటి ప్రయోజనం (ఏఐబీపీ) కింద మంజూరైన ప్రాజెక్టులకు కూడా ఇదే వర్తిస్తుంది. 90 శాతం నిధులను కేంద్రమే భరిస్తుంది.
పరిశ్రమలు
- పారిశ్రామిక యూనిట్లకు నూటికి నూరు శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది.
దీంతో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు ముందుకు వస్తారు. పారిశ్రామిక వృద్ధి వేగవంతం కావడానికి ఇది దోహదం చేస్తుంది.
- ప్లాంట్లు, యంత్రాల మీద పెట్టే పెట్టుబడిలో 30 శాతం రాయితీ లభిస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో పాటు, ప్రత్యేకహోదా ప్రకటన నాటికే ఏర్పాటై.. ఆ తర్వాత విస్తరణ చేపట్టిన పరిశ్రమలకు కూడా ఇది వర్తిస్తుంది.
ఔత్సాహికులు సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిర్ణయాలు దోహదం చేస్తాయి. మధ్య, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇలాంటి రాయితీలు పనికి వస్తాయి.
- పరిశ్రమల ఏర్పాటుకు తీసుకునే వర్కింగ్ క్యాపిటల్పై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.
- పరిశ్రమలకు 20 ఏళ్ళకు తగ్గకుండా విద్యుత్ ఛార్జీలపై 50 శాతం రాయితీ లభిస్తుంది.
- ఇవే కాకుండా ఇన్సూరెన్స్, రవాణా వ్యయంపైనా రాయితీలు ఉంటాయి.
ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఉంటే ప్రతిష్టాత్మక పారిశ్రామిక సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి రావడానికి మార్గం ఉంటుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.
- కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ ఏర్పాటు సమీకృత మౌలిక సదుపాయాల కల్పన కేంద్రాల ఏర్పాటులో పెట్టుబడుల తీరును ప్రత్యేక హోదా మారుస్తుంది.
- సాధారణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే కేంద్ర, రాష్ట్ర పెట్టుబడుల నిష్పత్తి 2:3 గా ఉంటుంది. అదే ప్రత్యేక హోదా ఉంటే 4:1 నిష్పత్తిలో ఉంటుంది.
ఫలితంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ తక్కువ పెట్టుబడితో కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దసంఖ్యలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వస్తాయి. తక్కువ నైపుణ్యం ఉన్నవారికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో ఈ పరిశ్రమలు దోహదం చేస్తాయి.
ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును కేంద్రం ప్రోత్సహిస్తోంది. వీటికి రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. హోదా దక్కితే ప్రోత్సాహకాలు, రాయితీలు పెరుగుతాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకు మార్గం ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా పరిశ్రమలు భారీగా వస్తాయి. గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధి పెరుగుతుంది.
ఆదాయపు పన్ను రాయితీ
- ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80-సి కింద కార్పోరేట్ ఆదాయపు పన్నులో పూర్తి మినహాయింపు ఇవ్వడానికి ప్రత్యేకహోదా అవకాశం కల్పిస్తుంది.
- ప్రత్యేక హోదా ఉన్నంతకాలం ఈ పన్ను మినహాయింపు ఉంటుంది.
- ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 25 నుంచి 50 శాతం వరకు పన్ను మినహాయింపు వచ్చే అవకాశం ఉంటుంది.
రుణాలు-వెసులుబాటు
- విదేశీ రుణ భారాన్ని కేంద్రమే భరిస్తుంది. రుణంలో 90 శాతం మొత్తాన్ని కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది.
- ఆ రుణంపై వడ్డీ కూడా కేంద్రమే కడుతుంది.
విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు రూ.5000 కోట్ల రుణాన్ని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకోవాలనే ప్రతిపాదన ఉంది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైళ్ళ ఏర్పాటుకు దాదాపు రు.8 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ రెండు ప్రాజెక్టులకు కూడా విదేశీ ఏజెన్సీల నుంచి రుణం పొందునున్నారు.
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ళు..విభజన చట్టంలో హామీలే. 90 శాతం రుణం కేంద్రం భరిస్తే.. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లో ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశం లభిస్తుంది. భారీగా ఊద్యోగాలూ వస్తాయి. కారిడార్ వెంబడి అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఉపాధి, యువత ముందుకు వస్తుంది.
ప్రత్యేకహోదాతో ప్రయోజనం పొందిన రాష్ట్రాలు..
ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం పొందిన రాష్ట్రాల గురించి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మెహన్ రెడ్డి గారు.. ఇటీవల అసెంబ్లీలో స్పష్టంగా వివరించారు. ఆ వివరాలు చూస్తే..
ఉత్తరాఖండ్కు ప్రత్యేకహోదా ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రంలో 2 వేల పరిశ్రమలు వచ్చాయి. రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో ఒకేసారి 130 శాతం అధికంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్ల ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగాయి.
హిమాచల్ ప్రదేశ్కు కూడా ప్రత్యేక హోదా వల్ల 10వేల పరిశ్రమలు వచ్చాయి. ప్రత్యేక హోదా కలిగిన జమ్మూ కాశ్మీర్కు ప్రధాని నరేంద్రమోడీ రూ.70 వేల కోట్ల గ్రాంట్ ఇచ్చారు. ఆ రాష్ట్ర జనాభా 1.25 కోట్లు మాత్రమే.
కేంద్ర పథకాలు
ఇటీవలి కాలంలో 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రాయోజిత పథకాలను కొన్నింటిని తొలగించినప్పటికీ ఇప్పటికే అనేక పథకాలు కేంద్రం అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు చేసే ఒత్తిడి మేరకు వాటి కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉంటున్నాయి. ఇందులో కనిష్టంగా ఏటా రూ.9 వేల కోట్లకు తగ్గకుండా ఆయా పథకాల కోసం కేంద్రం కేటాయిస్తోంది. రాష్ట్రం ఒత్తిడి చేస్తే రూ.15 వేల కోట్లకు తగ్గకుండా ప్రయోజనం పొందడానికి వీలుంటుంది. కనిష్టంగా లెక్క వేసినా అయిదేళ్ళలో రూ.45 వేల కోట్ల మేరకు రాష్ట్రానికి విధిగా కేంద్రం నుంచి నిధులు రావలసి ఉంటుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు