కర్నూలుకు త్వరలో ఎన్జీఎన్ సేవలు
– బీఎస్ఎన్ఎల్లో చురుగ్గా సాగుతున్న పనులు
కర్నూలు (ఓల్డ్సిటీ):
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రైవేట్ ఆపరేటర్లకు దీటుగా నిలిచేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రూ. 49కే ల్యాండ్ లైన్, 249కే బ్రాడ్ బ్యాండ్ వంటి పథకాలను ఇప్పటికే కొనసాగిస్తోంది. ఇటీవల కర్నూలు నగరంలోని నాలుగు చోట్ల 5జీ వైఫై అడ్డాలను ఏర్పాటు చేసింది. తదుపరి చర్యగా రాయలసీమలోనే ప్రప్రథమంగా కర్నూలులో నెక్ట్స్ జనరేషన్ నెట్వర్క్ (ఎన్జీఎన్) సేవలు ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఎన్జీఎన్ ప్రారంభమైతే వినియోగదారులకు మూడు రకాల ఆధునిక సేవలు లభించనున్నాయి. అవి ఏంటంటే..
బీఎస్ఎన్ఎల్ రూపొందించిన ప్రత్యేక యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఫిక్సెడ్ మొబైల్ టెలిఫోన్ (ఎఫ్ఎంటీ) సేవలు లభించనున్నాయి. ఎఫ్ఎంటీ నంబర్ ద్వారా ల్యాండ్ లైన్కు వచ్చే ఫోన్లను వినియోగదారుడు మొబైల్లోకి తీసుకోవచ్చు.
సెంట్రల్ ఎక్సేంజ్ (సెంట్రెక్స్) పద్ధతి ప్రవేశపెట్టనున్నారు. వినియోగదారుడు ఎక్కువగా మాట్లాడే బంధు మిత్రుల నంబర్లకు అంటే సూచించిన ఒక్కో నంబర్పై నెలకు రూ. 75 చొప్పున చెల్లిస్తే ఆయా నంబర్లతో నెలంతా ఎంతసేపైనా మాట్లాడే అవకాశం.
మల్టీమీడియా వీడియో కాన్ఫరెన్సింగ్ (ఎంఎంవీసీ)నూ ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం ద్వారా ప్రత్యేక ఫోన్లో వీడియో కాలింగ్ సదుపాయం ఏర్పడుతుంది.