కుమారుల దాడిలో తల్లి ప్రియుడి మృతి
ఎల్లారెడ్డి/లింగంపేట: వివాహేతర సంబంధం పెట్టుకున్న తల్లి, ఆమె ప్రియుడిపై కొడుకులు దాడి చేయగా ప్రియుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్ పరిధిలోని కొట్టాల్ గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భవానీపేట గ్రామానికి చెందిన యాదుల్ భార్య షబీనాబీ (40) అలియాస్ పద్మ అదే గ్రామానికి చెందిన ఎరుకల రాములు (45)తో చాలా రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగించేది. గత సంవత్సరం హైదరాబాద్కు యాదుల్ కుటుంబం వలస వెళ్లి జీవిస్తోంది.
ఇటీవల పొలం పనుల కోసం వారి కుటుంబం గ్రామానికి తిరిగి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గ్రామం నుంచి ఎరుకల రాములు, షమీనాబీ కలిసి ఎల్లారెడ్డికి వెళ్లడాన్ని గమనించిన ఆమె కుమారులు మహబూబ్, రజాఖ్, షాదుల్లు కొట్టాల వద్ద కాపు కాసి వారిపై దాడి చేశారు. కట్టెలతో ఇద్దరిపై తలపై కొట్టడంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన షమీనాబీని పోలీసులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ అనిల్కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.