సోంపేట పవర్ ప్లాంట్ రద్దు
విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలోని వివాదాస్పద సోంపేట థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆ విద్యుత్ ప్లాంట్ ను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సోంపేట పవర్ ప్లాంట్ కు కేటాయించిన 970 ఎకరాల్లో మల్టీ ప్రొడక్ట్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. శనివారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అక్రమార్కుల నుంచి అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఏబీ కేబినెట్ తీర్మానించింది. అవినీతి అధికారులపై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి, ఏడాదిన్నరలోగా విచారణ పూర్తి చేయడానికి సన్నద్ధమైంది. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీల అధికారాలను సీఎంకే అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయించింది.
ఏపీకి ప్రత్యేక హోదాపై వైఎస్సార్ సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ పై కేబినెట్ లో చర్చకు వచ్చింది. ప్రత్యేక హోదా అంశం ప్రజల్లో సెంటిమెంట్ గా మారిపోయిందని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లు సమాచారం. ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూనే ప్రజలను సంతృప్తి పరిచేలా మాట్లాడాలని మంత్రులకు బాబు సూచించినట్లు తెలుస్తోంది.