రైల్వేస్టేషన్‌కు సోలార్‌ వెలుగులు

రైల్వేస్టేషన్‌కు సోలార్‌ వెలుగులు - Sakshi

  • పీపీపీ పద్ధతిలో టెండర్ల ఆహ్వానం  

  • 25 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత


తాటిచెట్లపాలెం: వాల్తేరు రైల్వే డివిజన్‌ మరో అభివృద్ధిని సాధించబోతోంది. ఇప్పటికే హైస్పీడ్‌ వైఫై, అదనపు ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫాం విస్తరణ తదితర అంశాలపై దృష్టిసారించిన వాల్తేరు డివిజన్‌ తాజాగా.. విశాఖ రైల్వేస్టేషన్‌లో సోలార్‌ వెలుగులు నింపనుంది. రూఫ్‌టాప్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంను ఇన్‌స్టాల్‌ చేసే విధానానికి పచ్చజెండా ఊపింది. ఒక మెగా వాట్‌ పవర్‌ సామర్థ్యంతో స్టేషన్‌lపరిసరప్రాంతాల్లో విద్యుత్‌ అవసరాలకు సోలార్‌ బంధం వేయనుంది. దీనిపై ఇప్పటికే పీపీపీ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించింది. 

 

ఇదీ ప్లాన్‌..: ఓ మెగా వాట్‌ పవర్‌(1ఎండబ్ల్యూపీ) సామర్థ్యంతో ఆఫ్‌ గ్రిడ్‌ రూఫ్‌ టాప్‌ సిస్టంను ఏర్పాటు చేస్తారు. సంబంధిత సోలార్‌ప్లేట్ల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తిని పగటిపూట అవసరాలకు ఉపయోగిస్తారు. ప్రాధాన్యం ఉన్న స్థలం బట్టి 50 నుంచి 200 వాట్ల సామర్థ్యమున్న శక్తివంతమైన ఎల్‌ఈడీ లైట్లను పలుచోట్ల అమరుస్తారు. 1000 కిలోవాట్‌ శక్తిని ఉపయోగించుకుని ఇవి పనిచేస్తాయి. ఫ్యాన్లు, చార్జింగ్‌ పాయింట్లు దీనికి అదనం. మిగిలిన విద్యుత్‌ శక్తిని సమీప గ్రిడ్లకు విక్రయిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి మర్నాడు ఉదయం 8 గంటలకు వరకు అవసరమయ్యే విద్యుత్‌ను సబ్‌స్టేషన్ల నుంచి స్వీకరిస్తారు. రూ.8కోట్లతో 25 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు పీపీపీ పద్ధతిలో టెండర్లు ఆహ్వానించారు. నెట్‌ మీటరింగ్‌ సిస్టం ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ విధానం వల్ల విద్యుత్‌ ఆదాతో పాటు, విద్యుత్‌ బిల్లుల మోత రైల్వేశాఖకు కాస్త ఊరట కలిగించే అంశంగా మారబోతోంది. 

 

సెప్టెంబర్‌లో పనులు 

రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టం పనులను సెప్టెంబర్‌ చివరి/ అక్టోబర్‌ మొదటివారంలో ప్రారంభించే అవకాశాలున్నట్టు రైల్వేవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2017 ద్వితీయార్థంలో పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top