ముగ్గురికి పాము కాటు
వంగర : మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం ముగ్గురు రైతు కూలీలు పాము కాటుకు గురయ్యారు. పొలం పనుల్లో నిమగ్నమయ్యే సమయంలో పాము కాటు వేయడంతో అస్వస్తతకు గురయ్యారు. వంగర గ్రామానికి చెందిన రౌతు నరసింహులునాయుడు తూర్పు పొలంలో పని చేస్తుండగా పాముకాటు వేసింది.
శివ్వాం గ్రామానికి చెందిన బొత్స సూర్యనారాయణ టేకు పొలంలో పాము కాటుకు గురయ్యారు. మగ్గూరు గ్రామానికి చెందిన చింత భీమునాయుడు పంట పొలంలో నారు తీస్తుండగా పాము కాటు వేసింది. వీరికి వంగర పీహెచ్సీలో వైద్యాధికారి కె.సీతారాం ప్రథమ చికిత్సనందించి మెరుగైన వైద్యం కోసం రాజాం సీహెచ్సీకి 108లో తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు.