పాములు పట్టే వ్యక్తి.. పాముకాటుతోనే మృతి
జైపూర్లో విషాదం నింపిన ఘటన
జైపూర్ :
ఇళ్లలోకి పాములు వస్తే పట్టి సమీప ఆటవీప్రాంతంలో వదిలిపెట్టే వ్యక్తి చివరకు అదే పాముకాటుతో ప్రాణాలు కోల్పోయాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కేంద్రానికి చెందిన సారదీయ తపన్కుమార్(45) అనే ఆదివాసీ కూలీ పనులు చేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఇతడు పాములను పట్టుకోవడంలో నేర్పరి. కొన్నేళ్ల క్రితం వరకు మండలంలో ఎక్కడ ఇళ్లల్లో పాము కనిపించినా అతడిని సంప్రదిస్తే వెంటనే వచ్చి పామును పట్టుకొని సమీప అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలిపెట్టేవాడు. ఒకటిరెండు సార్లు పాముకాటుకు గురికావడంతో కొంతకాలంగా పాములు పట్టడం మానివేసి పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు.
అయితే బుధవారం మండలంలోని పెడపల్లి గ్రామానికి చెందిన రిక్కుల రామ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తమ ఇంటి సమీపంలోకి నాగుపాము వచ్చిందని తపన్కుమార్ను తీసుకెళ్లారు. తపన్కుమార్ పామును పట్టే క్రమంలో అది చేతికి రెండుసార్లు కాటువేసింది. ఆయినప్పటికీ పామును పట్టి అడవిలో వదిలిపెట్టాడు. అనంతరం రామ్రెడ్డి తపన్కుమార్ను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా శ్రీనివాస్రెడ్డి జైపూర్లో వదిలిపెట్టి వెళ్లాడు.
విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే జైపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. తపన్కుమార్కు భార్య రాజేశ్వరి, కుమార్తె విజయలక్ష్మి ఉన్నారు. దంపతులకు సంతానం లేకపోవడంతో విజయలక్ష్మిని దత్తత తీసుకున్నారు. తపన్కుమార్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. రాజేశ్వరి ఫిర్యాదు మేరకు రామ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డిలపై పోలీసులు కేసునమోదు చేశారు.