వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
సంగారెడ్డి టౌన్: వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మోజిరాం రాథోడ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గురువారం చైర్మన్ భరత్ సత్యనారాయణ మాట్లాడుతూ డీఎంఅండ్హెచ్ఓ తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళతానని చెప్పారన్నారు. కాంట్రాక్టు ఏఎన్ఎంలను ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు ఏఎన్ఎంలకు, సెకండ్ ఏఎన్ఎంలకు వందశాతం గ్రాస్ సాలరీ పీఆర్సీ ప్రకారం ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఎన్ఎంలకు యూనిఫాం అలవెన్స్, వేతనంతో కూడిన 120 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్, హెల్త్ అసిస్టెంట్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఉద్యోగులను పైఅధికారులు వేధించకూడదన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు లక్ష్మినారాయణ, మాణిక్యం, శాంత, ఉమాకాంత్, కృష్ణవేణి, సుధాకర్, ఏఎన్ఎంలు, రెండవ ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.