వెంకన్న ఐటీ ఓకే
►హ్యాకర్ల నుంచి సర్వర్లు భద్రం
►యథావిధిగా ఆన్లైన్ సేవలు
►అప్రమత్తమైన టీటీడీ ఐటీ నిపుణులు
►30 కంప్యూటర్ల పునరుద్ధరణ
తిరుమల: ప్రపంచాన్ని వణికించిన వైరస్ను టీటీడీ కట్టడి చేసింది. ప్రధాన సర్వర్లు, ముఖ్యమైన కంప్యూటర్లు భద్రంగానే ఉన్నాయి. ఇప్పటికే దెబ్బ తిన్న కంప్యూటర్లలో కొన్నింటిని తొలగించారు. మరికొన్నింటిని యథాస్థితికి తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఐటీ రంగాన్ని విస్తరిం చింది. ఐదారేళ్లుగా దీన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. భక్తుల సేవలు దాదాపుగా ఆన్లైన్ చేశారు. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ సహకారం తీసుకుంటున్నారు. భక్తుల సేవలతో ముడిపడిన కంప్యూటర్లను విండోస్ వెర్షన్ 8 నుంచి∙10వరకు అభివృద్ధి చేశారు. ‘వనా క్రై ర్యాన్సమ్ వేర్ పేరుతో పిలిచే వైరస్ ఫలితంగా రెండు మూడు రోజుల క్రితం వంద దేశాల్లో 1.5 లక్షల కంప్యూటర్లు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. సమాచారం వ్యవస్థ అస్తవ్యస్తమైంది.
చాలా సేవలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం జిల్లాపై కూడా పడింది. టీటీడీ పరిధిలో తిరుమలలో 800, తిరుపతిలో 1200 ఉండగా తిరుపతిలో కేవలం 30 లోపే హ్యాక్కు గురయ్యాయి. అవి కూడా కింది స్థాయి సిబ్బంది డీటీపీ, ఇతర క్లరికల్ పనులకు వాడేవి మాత్రమేనని తెలిసింది. మిగిలనవన్నీ భద్రంగా ఉన్నాయి. పూర్వపు ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఐటీ విభాగం అభివృద్ధికి గట్టి చర్యలు తీసుకునేవారని సిబ్బంది చెబుతున్నారు. విండోస్ ఎక్స్పీ వెర్షన్–7కు సంబంధించిన కంప్యూటర్లకు ఎప్పటికప్పుడు లీగల్ అనుమతులతో అప్డేట్చేయాల్సి ఉంటుంది.
వాటి విషయంలో ఐటీ విభాగం కొంత మెతక వైఖరి అవలభించింది. ఈ కారణంగా సుమారు 30 దాకా కంప్యూటర్లు దెబ్బతిన్నాయి. ఐటీ నిపుణులు, టీసీఎస్ సంస్థనిపుణులు రంగంలోకి దిగి అప్డేట్ చేసి, యథాస్థితికి తీసుకొచ్చారు. భవిష్యత్లో ఐటీ పరంగా చిన్నపాటి లోపాల్లేకుండా చేయాలని ప్రస్తుత ఈవో అనిల్కుమార్సింఘాల్ కూడా ఐటీ నిపుణులను ఆదేశించారు.