బిగుస్తున్న ఉచ్చు

బిగుస్తున్న ఉచ్చు - Sakshi


సిట్‌ లేదా సీఐడీకి కేసు..

పన్ను ఎగవేత కుంభకోణంపై సర్కారు సీరియస్‌

సీఎస్‌ ఎస్పీ సింగ్‌  ప్రత్యేక సమీక్ష

అక్రమార్కుల గుండెల్లో రైళ్లు




నిజామాబాద్‌ : వాణిజ్య పన్నుల శాఖ పన్ను ఎగవేత కుంభకోణంలో అక్రమార్కులపై ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ మేరకు సిట్‌(ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే కీలక సూత్రధారి శివరాజ్‌ అతని కుమారుడు సునీల్‌తోపాటు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బందిపై బోధన్‌లో కేసు నమోదైన విషయం విదితమే. వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించారు. మరోవైపు ఎగవేసిన పన్నును వసూలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ చర్యలు చేపట్టిన విషయం విధితమే. మొత్తం 117 మంది వ్యాపారులకు నోటీసులు జారీ చేసిన అధికారులు ఎగవేసిన రూ.50 కోట్లను రాబట్టే చర్యలను ముమ్మరం చేశారు.



లోతైన విచారణ

కేవలం 2012–13, 2013–14 ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.50 కోట్ల పన్ను ఎగవేసినట్లు ప్రకటించినప్పటికీ, ఆ శాఖ ఉన్నతాధికారులు దశాబ్ద కాలంగా జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న డాటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బోధన్‌లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో రికార్డులు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, కీలక సూత్రధారి శివరాజ్‌ కార్యాలయంలో ఉన్న రికార్డులను, ఫైళ్లను, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఆ శాఖ కమిషనరేట్‌కు తరలించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఆ శాఖలో నిపుణులైన అధికారులు, సిబ్బందిని నియమించి లావాదేవీలను పరిశీలిస్తున్నా రు. డాటా అందుబాటులో ఉన్న 2005 నుంచి జరిగిన లావాదేవీలను ఆరా తీస్తున్నారు. బోగస్‌ చలానాలు, బోగస్‌ బ్యాంకు ఖాతాలు సృష్టించి పన్ను ఎగవేసిన వ్యాపారులు ఎవరనే అంశంపై ఆరా తీసున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top