‘బడిబాట’ పట్టేనా..!

‘బడిబాట’ పట్టేనా..! - Sakshi


► జిల్లాలో 2వేలకు పైగా పిల్లలు బడిబయటే..

►  నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం

►  పట్టించుకోని అధికారులు

►  ఈ నెల 13 నుంచి బడిబాట




ఆదిలాబాద్‌టౌన్‌: పలకా బలపం పట్టాల్సిన చేతులు మెకానిక్‌ షెడ్లు, ఇటుక బట్టీల్లో పానలు, పారలు పడుతున్నారు. పుస్తకాలు చేతపట్టి అక్షరాలు దిద్దాల్సిన వీరు రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని ఆయా పట్టణాల్లోని రద్దీ ప్రదేశాల్లో బడీడు పిల్లలు భిక్షాటన చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, లాడ్జిల్లో దర్శనమిస్తున్నారు. విద్యాహక్కు చట్టం, కార్మిక శాఖ ఇటు వైపు చూస్తున్నట్లుగా కనిపించడం లేదు.


ఫలితంగా బాల కార్మికులకు విముక్తి కలగడం లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రవేశ పెట్టిన పలు కార్యక్రమాలు, చట్టాలన్ని మొక్కుబడిగా అమలవుతున్నాయి. కాగా ఈయేడాది రెండు నెలల ముందుగా మార్చి 21 నుంచే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. బడి బయటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు పది రోజులపాటు బడిబాట కార్యక్రమాలను నిర్వహించినా అంతగా ఫలించలేదు. దీంతో జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 13 నుంచి 17వ తేదీ వరకు మళ్లీ బడిబాట చేపట్టనున్నారు. ఈసారైనా బడిబయట పిల్లలు బడిలో చేరేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



బడికి రాని పిల్లలు

సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాలు చేపడుతోంది. ఉపాధ్యాయులు చిన్నారుల ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించి చేర్పించేలా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ పిల్లలు బడిబాట పట్టడం లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్, చదువుల పండుగ, బడిబాట, విద్యా పక్షోత్సవాలు, విద్యా సంబరాలు.. ఆచార్య జయ శంకర్‌ చదువుల పండగ.. ఇలా గత పదేళ్లలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.


ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే పిల్లలు బడిలోనే ఉండేవారు. కానీ అలా జరగడం లేదు. ప్రధానంగా ఐదేళ్ల క్రితం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోకపోవడం బాలలకు శాపంగా మారింది. ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 2వేలకు పైగా మంది చిన్నారులు బడిబయట ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయా మండలాల్లో బాల కార్మికులు అధికంగానే ఉన్నట్లుగా అధికారులు కూడా గుర్తించారు. కాగా, అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో 811 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. మార్చిలో నిర్వహించిన బడిబాటలో కనీసం 200 మందిని కూడా బడిలో చేర్పించలేక పోయారు. విద్యాహక్క చట్టంలో భాగంగా బాల కార్మికులను బడిలో చేర్పించేందుకు పట్టణ శివారు ప్రాంతంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో అవి మూతబడ్డాయి.



నెరవేరని లక్ష్యం..

సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేద కుటుంబాల్లోని పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యం నెరవేరడం లేదు. గత ఆరు సంవత్సరాల క్రితం విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. పిల్లలు బడికి.. పెద్దలు పనికి అనే నినాదంతో విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యానికి చేరువ కావడానికి చట్టం తీసుకువచ్చింది. లక్ష్యం సాధించకపోవడంతో విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు.


2009 అగస్టు 27న పార్లమెంటులో విద్యాహక్కు చట్టాన్ని ఆమోదించింది. 2010 ఏప్రిల్‌ నుంచి ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తోంది. చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు వివక్ష చూపడం వల్లే నేటికి ఉచిత నిర్బంధ విద్య అమలు కావడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరో విద్యా సంవత్సరంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా, బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించిన అధికారులు ఆ తర్వాత పిల్లలు బడికి వస్తున్నారో.. లేదో.. పర్యవేక్షించకపోవడంతో బడిలో చేరిన పిల్లలు తిరిగి బయటకు వెళ్లిపోతున్నారు.



13 నుంచి బడిబాట..

ఈ నెల 13 నుంచి 17 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. బడి బయట ఉన్న పిల్లలందరినీ బడిలో చేర్పించే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలోనే ఉండాలి. బడీడు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమవుతుంది. ఉపాధ్యాయులు బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేలా చూడాలి.

– కె.లింగయ్య, డీఈవో, ఆదిలాబాద్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top