నారాయణ విద్యార్థులకు తప్పిన ముప్పు
- బస్సు ఇంజిన్ నుంచి చెలరేగిన మంటలు
రావుకుప్పం(చిత్తూరు జిల్లా)
నారాయణ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్కూల్ బస్సులో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు కాపాడారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజవర్గం రామకుప్పం మండలంలో బుధవారం జరిగింది. కుప్పంలోని నారాయణ స్కూలు బస్సులో 40 మంది విద్యార్థులను ఎక్కించుకున్న డ్రైవర్ రామకుప్పం మీదుగా విజలాపురం మార్గంవైపు వెళ్లాడు.
మార్గమధ్యలోని వీర్నగపురం గ్రామం వద్ద బస్సు ఇంజిన్లో నుంచి భారీగా పొగ కమ్ముకోవడంతో పాటు మంటలు చెలరేగాయి. దీంతో బస్సును రోడ్డుపైనే ఆపేసిన డ్రైవర్ కిందికి దిగిపోయాడు. బస్సులోని విద్యార్థుల కేకలు విని అప్రమత్తమైన ఆ స్థానికులు వారిని రక్షించారు. ఇంజిన్పై నీళ్లుపోసి మంటలను ఆర్పారు. దీంతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. కండీషన్లో లేని బస్సు నడపడం ద్వారా తమ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.