దళిత భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు


రాజమహేంద్రవరం: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశంలో మాదిగలు వినతిపత్రం ఇస్తే ప్రభుత్వానికి సమర్పిస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ చెప్పారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అధికారులతో సమీక్ష, రాజ మహేంద్రవరం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు.



రాజమహేంద్రవరం డివిజన్‌లో దళితుల భూములు అన్యాక్రాంతమైనట్టు తమ దృష్టికి వచ్చిందని, రెవెన్యూ అధికారులు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. దళిత భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రుణాలను రాజమహేంద్రవరం కార్పొరేషన్ కమిషనర్ వెంటనే మంజూరు చేయాలని కోరారు. వెంకటాయపాలెం శిరోముండన కేసు పురోగతి కోసం కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్‌ను ఆదేశించినట్టు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లను కుల వివక్షతో వేధింపులకు గురిచేసినా, అనవసరంగా చెక్‌పవర్ రద్దు చేసినా సహించేది లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు గ్రామసభ తీర్మానాలు చేయడంలో అడ్డుపడవద్దని కారెం శివాజీ కోరారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top