25న సామూహిక సత్యాగ్రహం
అనంతపురం సెంట్రల్ : జిల్లా కరువు నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న జిల్లా కేంద్రంలో సామూహిక సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ తెలిపారు. గురువారం కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో కరువుపై సామూహిక సత్యగ్రహం పోస్టర్లను విడుదల చేశారు. ఈసందర్భంగా కోటా సత్యం మాట్లాడుతూ జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా నెలకొన్నాయని, రైతులు, కూలీలు లక్షలాది మంది పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారని అన్నారు.
కరువు జిల్లా ప్రజలను ఆదుకోవాల్సిన అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు ఇసుక దందాలు, డబ్బు సంపాదనలో పోటీ పడుతున్నారని, ఏకంగా ఒకరినొకరు దాడులు చేసుకునే స్థాయికి ఎదిగారన్నారు. కరువు రైతులను ఆదుకోవాలని, జిల్లాకు 100 టీఎంసీలు సాగు నీరు తీసుకురావాలని, మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ సామూహిక సత్యాగ్రహం చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శైలజానాథ్, నాయకులు రమణ, చంద్రశేఖర్, కొండారెడ్డి, వశికేరి శివ తదితరులు పాల్గొన్నారు.