ఏసీబీ వలలో ఆర్డబ్య్లూఎస్ డీఈ
► రూ.14వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
► కమిషన్ ఇస్తేనే బోర్లకు బిల్లులు చేస్తామన్న అధికారి
► బాధితుడి ఫిర్యాదుతో వలపన్ని పట్టుకున్న ఏసీబీ
యర్రగొండపాలెం: కమిషన్ ఇస్తేనే తాగు నీటి కోసం వేసి బోర్లకు బిల్లులు చేస్తానన్న ఆర్డబ్ల్యూఎస్ డీఈని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ దాడులు జరిపిన దాడుల్లో రూ. 14వేలు లంచం తీసుకుంటూ డీఈ డీ లక్ష్మణనాయక్ ఏసీబీకి దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళితే.. పెద్దారవీడు మండలంలోని గొబ్బూరులోని ఎస్సీ కాలనీలో తీవ్ర నీటిఎద్దడి తలెత్తింది. ప్రజలకు నీటిని సరఫరా చేసేందుకు ఆ గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు వెన్నా పెద్దపోలిరెడ్డి కుమారుడు వెంకటరెడ్డి రూ.5 లక్షలు ఖర్చుపెట్టి రెండు బోర్లు వేయించాడు. అందుకు బిల్లులు చేయమని డీఈని సంప్రదించాడు. 3శాతం కమిషన్ ఇస్తేనే బిల్లులు చేస్తామని గత 3నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు. చేసేదిలేక వెంకటరెడ్డి ఈ నెల 9వ తేదీన ఒంగోలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఐలు టీవీవీ ప్రతాప్కుమార్, టి.సంజీవ్కుమార్లు పథకం ప్రకారం వెంకటరెడ్డితో నగదును పంపించారు. నగదును తీసుకున్న డీఈ బిల్లులు చేసిఇస్తామని, ఆ బిల్లులు తీసుకొని పొదిలిలోని ఈఈ కార్యాలయానికి తీసుకు వెళ్లండంటూ రాత్రి 7గంటల వరకు బాధితుడిని కూర్చోపెట్టుకున్నాడు. ఈ తరుణంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి డీఈని పట్టుకున్నారు. ఈ నగదుతోపాటు అనధికారికంగా డీఈ వద్ద ఉన్న మరో రూ.77వేలు కూడా స్వాధీనం చేసుకున్నారు.