విజయవాడలో సినీఫక్కీలో చోరీ
విజయవాడ: ఓ యువకుడికి తోడుగా వచ్చిన స్నేహితురాల్లే చోరీకి పాల్పడిన ఘటన విజయవాడలో కలకలం రేపింది. సినీపక్కీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తనతో పాటు వచ్చిన ఇద్దరు యువతులు రూ.20 లక్షలు చోరీకి పాల్పడినట్టు బాధితుడు నివాస్ ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇద్దరు యువతులతో కలిసి నివాస్ తన కారులో రైల్వే స్టేషన్ కు బయలుదేరాడు. బెంజ్ సర్కిల్ లోని ఓ హోటల్ వీరంతా టిఫిన్ చేశారు. రైల్వే స్టేషన్ కు వెళ్లేసరికి కారులో ఉన్న రూ. 20 లక్షలు మాయమయ్యాయి. దీంతో నివాస్ సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు యువతులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనం తామే చేశామని వారు అంగీకరించినట్టు తెలిసింది. డబ్బు సంచిని బందర్ కాల్వ వద్ద గుర్తించారు.
ఇద్దరు యువతులు ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారు కావడంతో కేసు బయటకురాకుండా పోలీసులపై ఓ మంత్రి ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు కేసు వివరాలు వెల్లడించడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.