మాజీ సర్పంచ్ ఇంట్లో చోరీ యత్నం
పోలీసుల అదుపులో నిందితుడు
కోట(గూడూరు): చెందోడు మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు నరమాల వెంకటరమణయ్య ఇంట్లో చోరీకి పాల్పడేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విద్యానగర్లోని వెంకటరమణయ్య నివాసం వద్ద రాత్రి 7 గంటల సమయంలో మిద్దెపై ముగ్గురు వ్యక్తులు నక్కి ఉండడాన్ని ఇంట్లోని మహిళ గుర్తించింది. నల్లటి ముసుగులు ధరించి ఉన్నట్లు తెలిపింది. భయాందోళనలతో ఆమె కేకలు పెట్టడంతో వారు మిద్దెపై నుంచి దూకి పరారయ్యారు. అక్కడే పెట్రోల్ బంక్ వద్ద ఉన్న యువకులు వెంబడించి తరుముకున్నారు.
మద్యం సేవించి ఉన్న ఇద్దరు పట్టుబడగా మరో వ్యక్తి పరారయ్యాడు. వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పది రోజుల క్రితం ఇలాగే అర్ధరాత్రి సమయంలో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారని వెంకటరమణయ్య తెలిపారు. పట్టుబడిన ఇద్దరు నిందితులు తమిళ, తెలుగుభాషలు మాట్లాడుతున్నట్లు తెలిపారు. దొంగల ముఠాలో ఐదుమంది వరకు ఉన్నట్లు సమాచారం. లోతుగా విచారిస్తే వారి నుంచి మరికొన్ని చోరీ కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హెడ్కానిస్టేబుల్ జేమ్స్కు వారిని అప్పగించారు. పోలీసులు విచారిస్తున్నారు.