దారి కష్టాలు దూరం
►ఆవాసాలకు బీటీ రోడ్లు
►రూ.168 కోట్లతో 95 మారుమూల ప్రాంతాలకు రహదారులు
►ఉమ్మడి జిల్లాలో పీఎంజీఎస్వై కింద ప్రతిపాదనలు
►రూ.57.40 కోట్లతో మరో 36 వంతెనల పనులకు టెండర్లు
ఆదిలాబాద్: రోడ్డు సౌకర్యం లేక నరకయాతన అనుభవించిన మారుమూల ప్రాంతాల ప్రజల కల ఇక నెరవేరనుంది. ఇప్పటివరకు నల్ల తారు(బీటీ) రోడ్డు ఎరగని ఆ గ్రామాల ప్రజల రవాణా కష్టాలు ఇక తీరనున్నాయి. ఆవాసాలు ఏర్పడి దశాబ్దాలు గడిచినా కనీస సౌకర్యాలకు నోచుకోక దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కష్టాలు అంతా ఇంత కావు. అత్యవసర సమయాల్లో ప్రజలు పడే అవస్థలు వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్వై) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆయా గ్రామాలకు మొదట గ్రావెల్(మొరం, కంకర) రోడ్లను నిర్మించి, ఆ తర్వాత దాని ఉన్నతీకరణలో భాగంగా బీటీ రోడ్డుగా మారుస్తుంది.
ఉమ్మడి జిల్లాలో
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఆవాసాలకు గతంలో గ్రావెల్ రోడ్లను పీఎంజీఎస్వై కింద నిర్మించారు. ఆ రోడ్ల ఉన్నతీకరణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 11వ విడతలో రూ.168 కోట్లతో 95 ఆవాసాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి వారం రోజుల క్రితం జాతీయ గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్ఆర్ఆర్డీఏ)కు ప్రతిపాదనలు పంపించాయి. 392 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఈ రోడ్లకు ఒక్కో కిలోమీటర్కు సగటున రూ.42.92 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనాల్లో పేర్కొన్నారు.
దీంట్లో ఆదిలాబాద్, కుమురంభీం(ఆసిఫాబాద్) జిల్లాలకు సంబంధించి మారుమూల ఆవాసాలు అధికంగా ఉండగా, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు సంబంధించి తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు సంబంధించి డిటేల్ ప్రాజెక్టు(డీపీ) యాక్ట్ తయారు చేసుకోవాలని ఎన్ఆర్ఆర్డీఏ నుంచి ఆదేశాలు వచ్చాయి. జిల్లా అధికారులు ఈ డీపీ యాక్ట్ తయారు చేసిన తర్వాత స్టేట్ టెక్నికల్ ఏజెన్సీ(ఎస్టీఏ)కు పంపిస్తారు. అక్కడి నుంచి ఎన్ఆర్ఆర్డీబీ ఆ ప్రొసీజర్ పూర్తిగా నిబంధనల మేరకు జరిగిందా అని పరిశీలన చేసి క్లియరెన్స్ ఇస్తుంది. ఎంపవర్ కమిటీలో దీనికి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఎన్ఆర్ఆర్డీబీ నుంచి అప్రూవల్ రాగానే ఈ పనుల టెండర్లు, అగ్రిమెంట్ చేస్తారు.
కేంద్రం 60 శాతం.. రాష్ట్రం 40 శాతం నిధులు..
ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద ఆవాసాల్లో రోడ్ల నిర్మాణం కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం 90శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు భరించేవి. ఇప్పటివరకు పది విడతల్లో ఇదే నిష్పత్తిలో రోడ్ల కోసం నిధుల మంజూరు, పనుల నిర్మాణం కొన్ని పనులు పురోగతిలో ఉండగా, ఎక్కువశాతం పూర్తయ్యాయి. 11వ విడత నుంచి కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకుంది. పీఎంజీఎస్వై కింద 60శాతం నిధులను మాత్రమే కేంద్రం భరిస్తుండగా, రాష్ట్రం వాటాను 40 శాతానికి పెంచింది. 2009–10లో దేశంలో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద 60 వెనుకబడిన జిల్లాల్లో రోడ్ల అభివృద్ధి చేపట్టాలని కేంద్రం గుర్తించిన జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉంది.
గతంలో 500 జనాభా ఉన్న ఆవాసాలకు మాత్రమే పీఎంజీఎస్వై కింద రోడ్డు కనెక్టివిటీ కల్పించే సదుపాయం ఉండగా, ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద ఎంపికైన జిల్లాల్లో 250 జనాభా ఉన్న ఆవాసాల్లోనూ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయి. పీఎంజీఎస్వైలో 2001 సంవత్సరంలో కోర్నెట్ ఆధ్వర్యంలో మండలాల వారీగా ఏఈలు సర్వే చేశారు. అప్పుడు రోడ్ల ఆవశ్యకత ఉన్న ఆవాసాల సంఖ్యను అందజేశారు. దాని ఆధారంగానే విడతల వారీగా పీఎంజీఎస్వై కింద రోడ్ల మంజూరు జరుగుతుంది. ఇప్పటివరకు పది విడతలు పూర్తయింది. ఇదిలా ఉంటే మొదటి విడతల నుంచి 8వ విడత వరకు చేపట్టిన పనుల్లో అక్కడక్కడ మిగిలిపోయిన పనులను 9వ విడతలో తీసుకున్నారు. ప్రస్తుతం 11వ విడతలోనూ 1 నుంచి 10వ విడతలో జరిగిన పనుల్లో మిగిలిపోయిన పనులను చేపడుతున్నారు.