బడగ వేడుకల్లో విషాదం
►రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి.. మరో ఐదుగురికి గాయాలు
►వాంకిడి మండలం బెండార వద్ద ఆటోను ఢీకొన్న గుర్తుతెలియని లారీ
►మృతులంతా కెరమెరి మండలానికి చెందినవారే..
►సరండి భవానిమాత ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘటన
ఆసిఫాబాద్/కెరమెరి: బడగ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. అందరూ సంబరంగా వేడుకలు జరుపుకుంటుండగా ఆ కుటుంబాల్లో అమావాస్య చీకట్లు అమలుకున్నాయి. వాంకిడి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 11 మంది స్నేహితులు ఆటోలో కుమురంభీం జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామ సమీపంలోని బోడగుట్టపై నిర్వహించే భవానీ జాతరకు మంగళవారం ఉదయం వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో ఆసిఫాబాద్–చంద్రాపూర్ ప్రధాన రహదారిపై వాంకిడి మండలం బెండార గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద ఆటోను ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.