లారీ-బస్సు ఢీ: 10 మంది మృతి
రామన్నపేట (నల్లగొండ జిల్లా): నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో బుధవారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. నార్కెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఎదురుగా అత్యంత వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఒక మలుపు వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ వైపు కూర్చున్న వాళ్లంతా మరణించారు. దాదాపు వారం రోజుల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. నల్లగొండ జిల్లాల్లో మలుపుల వద్ద ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 25 మంది ప్రయాణికులతో వెళుతున్న AP29 Z 2270 నెంబర్ బస్సు నల్లగొండ నుంచి భువనగిరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరి కొంతమందికి కాళ్లూ చేతులు విరిగాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడినవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. క్షతగాత్రులను రామన్నపేట, చిట్యాల ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సంఘటనా స్థలం నుజ్జునుజ్జయిన మృతదేహాలతో హృదయవిదారకంగా మారింది.
ఈ సంఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలను ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల వంతున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
మృతుల వివరాలు ఇవీ..
బస్సు డ్రైవర్ మల్లారెడ్డి- చిన్నతుమ్మలగూడెం, నకిరేకల్
అంతటి వెంకన్న-కట్టంగూరు
భూపతి శ్రీదేవి - ఊట్కూరు
కందాల అశ్విని - రామన్నపేట
రాజేశ్ - కండక్టర్
సలీమాబేగం - తుమ్మగూడెం
విజయలక్ష్మి - ఉప్పల్
8 నెలల చిన్నారి కూడా మృతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.