లారీ డ్రైవర్‌ ఏమరుపాటు...


  • వ్యాన్‌ డ్రైవర్‌కు గ్రహపాటు

  •  రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

  • గండేపల్లి :

    డ్రైవర్‌ ఏమరపాటు వల్ల జరిగిన ప్రమాదంలో మరో వాహన డ్రైవర్‌ మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలివి...శుక్రవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం వైపు నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ గండేపల్లి, మల్లేపల్లి గ్రామాల మధ్యకు వచ్చేసరికి డ్రైవర్‌ తన లారీని సడన్‌గా ఆపడంతో వెనకే వస్తున్న హైషర్‌ వ్యాన్‌ బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో వ్యాన్‌ ముందు భాగం నుజ్జునుజ్జయి డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు, సిబ్బంది ప్రసాద్, అచ్చిరాజు, ఇ.బి.రావు తదితరులు సహాయక చర్యలు చేపట్టారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకుతీసి పోలీస్‌ వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో అందుబాటులోకి వచ్చిన 108 అంబులెన్స్‌లోకి క్షతగాత్రుడిని మార్చి తరలించారు. మార్గమధ్యలోనే అతడు మృతి చెందాడు. డ్రైవర్‌ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో వాహనాల తనిఖీ అధికారులు ఉండటంతో హఠాత్తుగా గమనించిన డ్రైవర్‌ (ప్రమాదానికి కారణమైన లారీ) తన లారీని సడన్‌బ్రేక్‌ వేసి ఆపడంతో వెనుక వస్తున్న వ్యాన్‌ లారీని ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. 

     

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top