రిషితేశ్వరి ఆత్మహత్య కేసుపై గవర్నర్ ఆరా
హైదరాబాద్:నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని రిషితేశ్వరి కేసు పురోగతిపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం గవర్నర్ కలిసిన నేపథ్యంలో యూనివర్శిటీకి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ఇప్పటి వరకూ జరిగిన విచారణ ఎలా సాగిందని గవర్నర్ వివరణ కోరారు. ఆ విద్యార్థినిపై ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. దీంతో పాటు యూనివర్శిటీలో ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గంటాను ఆదేశించారు.
యూనివర్శిటీలో విద్యార్థినుల రక్షణకు తీసుకుంటున్నామని గంటా తెలిపారు. విచారణకు సుబ్రమణ్యం కమిటీని నియమించామని స్పష్టం చేశారు. రిషితేశ్వరి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం, ఇళ్ల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు గంటా తెలిపారు.