బరితెగించారు..!

టెక్కలి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి రైస్‌ మిల్లుకు అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన బియ్యం బస్తాలు

–ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి అక్రమంగా బియ్యం తరలింపు

–నేరుగా మిల్లులకు తరలించేందుకు ప్రయత్నాలు

–అజ్ఞాతవ్యక్తి సమాచారంతో బియ్యాన్ని పట్టుకున్న అధికారులు

–బియ్యం అక్రమ తరలింపును ముందే చెప్పిన ‘సాక్షి కథనాలు’

–జిల్లా అధికారులు స్పందించకపోవడంపై అనుమానాలు

 

టెక్కలి: చౌక ధరల దుకాణాల నుంచి పేదలకు చేరాల్సిన బియ్యం రైస్‌ మిల్లులకు తరలిస్తున్న ఘటన టెక్కలిలో శనివారం వెలుగుచూసింది. టెక్కలి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి బహిరంగంగా 3 రిక్షాలతో సుమారు 9 బస్తాలు (ఒక్కో బస్తా సుమారు 50 కేజీలు) పీడీఎస్‌ బియ్యంను రైస్‌ మిల్లుకు తరలిస్తుండగా ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆర్‌ఐ వెంకటరమణతో పాటు దిగువ స్థాయి సిబ్బంది దాడిచేశారు. మూడు రిక్షాల్లో రెండింటిని పట్టుకున్నారు.

 

6 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి పట్టణంలోని వెంకటలక్ష్మి గణేష్‌ మోడ్రన్‌ రైస్‌ మిల్లుకు బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఒడిశాకు చెందిన బియ్యంతో పాటు చౌక ధరల దుకాణాల్లోని బియ్యాన్ని రైస్‌ మిల్లులకు అక్రమంగా తరలిస్తూ వాటిని పాలిషింగ్‌ చేసి నాణ్యమైన బియ్యంగా మార్కెట్‌లో విక్రయాలు చేస్తున్నట్లు శనివారం సాక్షిలో  ‘మరో మలుపు’అనే కథనం వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా వెలుగు చూసిన ఘటన దీనికి మరింత బలాన్నిచ్చింది. ఎప్పటికప్పుడు బియ్యం పట్టుబడుతున్నా జిల్లా అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా అక్రమ వ్యాపారాలు సాగిస్తున్న మిల్లర్లపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలని స్థానికులు పేర్కొంటున్నారు. 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top