ప్రభుత్వ పథకాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కూసుమంచి : ముస్లింలకు ప్రభుత్వ పథకాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని పేద ముస్లింలకు ప్రభుత్వం అందించే దుస్తులను మంత్రి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాలు, మతాలకు, పండగలకు తగిన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రంజాన్ పండగను ముస్లింలు ఆర్థిక తారతమ్యాలు లేకుండా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
పేద ముస్లింల పిల్లల చదువుల కోసం నియోజకవర్గానికో రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26,27 తేదీల్లో ఈ పాఠశాలలు ప్రారంభమవుతాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ వడ్త్యి రాంచంద్రునాయక్, సర్పంచ్ బారి వెంకటమ్మ, ఎంపీటీసీ బారి శ్రీనివాస్, తహసీల్దార్ కిషోర్కుమార్, ఎంపీడీఓ విద్యాచందన, మసీదు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రఫిక్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.