అత్యాచారం.. ఆపై హత్య
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో దారుణం
వికారాబాద్: దుండగులు ఓ మహిళపై అత్యాచారం చేసి.. అనంతరం చంపేశారు. కలకలం రేపిన ఈ సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మోమిన్పేట మండలం వెల్చాల్ గ్రామానికి చెందిన సాయిలు, చెన్నమ్మ(45) దంపతులు. కొన్నేళ్ల క్రితం దంపతులు బతుకుదెరువు కోసం వికారాబాద్ పట్టణానికి వలస వచ్చి సుభాష్నగర్కాలనీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణభారం కావడంతో సాయిలు ముంబైకి వలస వెళ్లాడు. అనంతరం ఆయన ఆచూకీ లేకుండా పోయింది.
భర్త కోసం గాలించినా ఫలితం లేకుండా పోవడంతో చెన్నమ్మ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం చెన్నమ్మ కష్టపడి కూతుళ్ల పెళ్లి చేసింది. కూలీ పనిచేస్తున్న ఆమెకు నిత్యం కల్లు తాగుతుండేది. ఈక్రమంలో మంగళవారం రాత్రి 7 గంటలకు ఆమె వికారాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని కంపౌండ్లో కల్లు తాగి ఇంటికి బయలుదేరింది. ఇదిలా ఉండగా, మున్సిపల్ పరిధిలోని గంగారం శివారులో ఆమె బుధవారం ఉదయం మృతదేహంగా పడి ఉంది. దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ స్వామి, వికారాబాద్ సీఐ రవి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
మహిళపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. అయితే, మత్తులో ఉన్న చెన్నమ్మను దుండగులు లాక్కెళ్లి అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, దుండగులు చెన్నమ్మను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు అపహరించుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసు జాగిలాలు ఘటనా స్థలానికి సమీపంలో తచ్చాడాయి. మృతురాలి చిన్నకూతురు సునీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.