ర్యాగింగ్ గొడవతో.. మరో విద్యార్థిని ఆత్మహత్య
నిన్న కాక మొన్న... నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషితేశ్వరి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు అదే గుంటూరు జిల్లాలోని మరో కాలేజిలో మరో విద్యార్థిని కూడా ర్యాగింగ్ నేపథ్యం వల్లే ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఈమె ర్యాగింగ్కు గురి కాలేదు.. కాలేజిలో జరుగుతున్న ర్యాగింగ్ వ్యవహారాన్ని ఆపాలని, దాన్ని వీడియోతీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అలా చేసినందుకు ప్రిన్సిపాల్ మందలించడంతో మనస్తాపం చెంది కాలేజి ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు వదిలింది.
ఈ ఘటన బుధవారం గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలంలోని మలినేని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. సునీత (22) ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతోంది. అదే కాలేజిలో మొదటి సంవత్సరం విద్యార్థులను రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి తన ఫేస్బుక్లో ఫోస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ప్రిన్స్పాల్ సునీతను పిలిపించి మందలించారు. తీవ్రంగా మనస్తాపం చెందిన సునీత కాలేజీ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. విషయం తెలిసిన కాలేజీ సిబ్బంది సునీతను వెంటనే గుంటూరులోని లలిత ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీత మృతిచెందింది. విషయం తెలిసిన పోలీసులు కాలేజీకి చేరుకొని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.