వారధిపై ట్రాఫిక్ జామ్
విజయవాడ : కనకదుర్గమ్మ వారధిపై బుధవారం ట్రాఫిక్ జామ్ అయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రకాశం బ్యా రేజి మరమ్మతుల కారణంగా, ట్రాఫిక్ను వారధిపైకి మళ్లించారు. మరోవైపు రాజధానికి ఉద్యోగులు వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించటంతో వారధిపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. విజ యవాడ నుంచి వెలగపూడికి ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ఈ క్రమంలో వారధిపై ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్లు ఇతర వాహనాలలో తరలివెళ్లారు. వారధి అవతల తాడేపల్లి వద్ద ఉద్యోగులకు స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
వారధిపై వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కూడా ట్రాఫిక్ సమస్యకు మరింత కారణమైందని పోలీసులు తెలిపారు. వాహనాలు నెమ్మదినెమ్మదిగా సాగటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు.