ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు
కరీంనగర్ సిటీ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కరీంనగర్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఆంజనేయరావు అధ్యక్షతన మంగళవారం ఆర్ఐవో కార్యాలయంలో జరిగింది. ఇప్పటివరకు అధ్యక్షురాలుగా ఉన్న సుహాసిని డీవీఈవోగా పదోన్నతి పొందడంతో ఖాళీ అయిన అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేశారు. ఉపాధ్యక్షుడిగా ఎస్.హన్మాండ్లు, సలహాదారుడిగా కె.జితేందర్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బదలీలు జరగలేదని, కొత్త జిల్లాలు ఏర్పడుతున్న తరుణంలో బదిలీలు చేపట్టాలని కోరారు. నూతన అధ్యక్షుడిని డీవీఈవో సుహాసిని, ఆర్ఐవో అబ్దుల్ ఖాలీక్ అభినందించారు. సమావేశంలో సంఘం సంయుక్త కార్యదర్శి డి.మధుమోహన్రావు, మహిళా కార్యదర్శి డి.కల్పన, ప్రతినిధులు డి.మనోహర్, కె.రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.