సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి

సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి - Sakshi


భద్రాచలం (ఖమ‍్మం జిల్లా) : భద్రాచలం రామక్షేత్రం కల్యాణ శోభను సంతరించుకుంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిలో ప్రతీ ఏటా సంప్రదాయబద్దంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు.  5న తేదీ బుధవారం శ్రీసీతారాముల కల్యాణం,  6న గురువారం శ్రీరామపట్టాభిషేకం జరగనుంది. ఈ ఏడాది ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వంసిద్ధం చేసింది. ఇందుకుగాను మిథిలా ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. చలువ పందిళ్ల నిర్మాణం గావించారు. ప్రాంగణాన్ని సెక్టార్ల వారిగా విభజించి భక్తులు కనులారా తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. రామాలయాన్ని విద్యుదీపాలంకరణ గావించడంతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది.



రామాలయ పరిసరాలు శోభాయమానంగా మారాయి. పట్టణ ప్రధాన వీధులన్ని స్వాగతద్వారాలతో నిండిపోయాయి. పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దారు. గత ఏడాది కంటే ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 3లక్షల మందికి పైగా భక్తులు కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకాలకు హాజరయ్యే అవకాశం ఉంది. భక్తుల కోసం 3లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్దం చేస్తున్నారు. 100క్వింటాల కళ్యాణం తలంబ్రాలను సిద్ధంచేశారు. పట్టణంలోని వివిధ కూడళ్లల్లో భక్తులు విశ్రాంతి పొందుటకు ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీల టిక్కెట్ల విక్రయాలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరుకానున్నారు. ప్రభుత్వం తరుపున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ముందుగా సీఎం కేసీఆర్ రాములోరిని దర్శించుకొని మిథిలా ప్రాంగణానికి చేరుకుంటారు.



ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని స్థానిక పురుషోత్తపట్నం సమీపంలో హెలీప్యాడ్‌ను సిద్దం చేశారు. పోలీస్‌లు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రితో పాటు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ ఏడాది పెద్దఎత్తున కల్యాణానికి హాజరుకానున్నారు. గురువారం జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ కే.నర్సింహన్ దంపతులు హాజరుకానున్నారు. శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా భద్రాచలం తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో రామాలయ పరిసరాలు నిండిపోయాయి.



గతేడాది కంటే ఈసారి భక్తుల సంఖ్య భాగా పెరుగుతోంది. ఎండను సైతం లెక్కచేయకుండా రాములోరి కళ్యాణానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా సమీప ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు తదితర రాష్ర్టాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున భద్రాద్రికి చేరుకుంటున్నారు. మరికొంత మంది భక్తులు కాలినడకన ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు. వీరు విశ్రాంతి పొందేందుకు గాను పట్టణ పలు ప్రాంతాల్లో ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. 3లక్షల మందికి పైగా భక్తులు ఈ ఏడాది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. భక్తులకు కల్పించే సౌకర్యాలు పూర్తికావచ్చాయి. భద్రాచలం పట్టణంతో పాటు పర్ణశాలలో కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా పట్టణాలను అందంగా ముస్తాబు చేశారు.



భద్రాచలానికి నేటి నుంచి బస్సులు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు 580 ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలుప్రాంతాల నుంచి భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు నడుపుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top