పేదల గుడిసెల తొలగింపు

పేదల గుడిసెల తొలగింపు

  •  తెలుగు తమ్ముళ్ల అరాచకాలలో మరో అధ్యాయం

  •  ఎస్టీ కాలనీలో భారీగా మోహరించిన పోలీసులు

  •  రెండు పొక్లెయిన్‌లతో విధ్వంసం 

  •  

    సత్తెనపల్లి: ఎంత కోరినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి టీడీపీలో చేరడం లేదని తెలుగు తమ్ముళ్లు కక్షకట్టారు. నిరుపేదల గుడిసెలను ఉన్నపళంగా తొలగించేందుకు నిర్ణయించారు. కూలిజనంపై తమ ప్రతాపం చూపారు. నాయకుల ఒత్తిడిని తట్టుకోలేక వారి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పోలీసు బలగాలతో సత్తెనపల్లి మండలం గుడిపూడి ఎస్టీ కాలనీకి గురువారం చేరుకున్నారు. సీఐ, ముగ్గురు ఎస్‌ఐలు, భారీగా పోలీసులు, రెవెన్యూ అధికారులు రావడంతో నిరుపేదలకు కాళ్లూ, చేతులు ఆడలేదు. లే అవుట్‌ వేసి అభివద్థిపర్చేందుకు గుడిసెలు తొలగించాలని అధికారులు హుకుం జారీ చేశారు. వెంటనే పొక్లెయిన్లు రంగంలోకి దిగాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా రణరంగాన్ని తలపించింది. ఉన్నపళంగా ఖాళీ చేయమంటే పేదలు ఎక్కడికి వెళ్తారని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కట్టా సాంబయ్య, సర్పంచ్‌ గుంటూరు నతానియేలు అధికారులను ప్రశ్నించారు. పేదల ఇబ్బందులను దష్టిలో ఉంచుకొని కనీసం నెల రోజులైనా గడువు ఇస్తే, మీరు చెప్పినట్లు ఖాళీ చేస్తారని చెప్పారు. నెల రోజులకు ససేమిరా అనడంతో వారమైనా గడువు ఇవ్వమని కోరారు. దానికి కూడా ఒప్పుకోకుండా 24 గంటల్లో ఖాళీ చేయాలంటూ, అప్పటికప్పుడు విద్యుత్‌ అధికారులకు ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరా నిలిపివేయమని తహసీల్దార్‌ ప్రసాద్‌ చెప్పారు. కట్టా సాంబయ్య మాట్లాడుతూ వారం రోజుల్లో ఖాళీ చేస్తారని, మళ్లీ రాజకీయం చేయకుండా అందరికీ పట్టాలు ఇవ్వాలని కోరగా, ఇక్కడ ఖాళీ చేసే వారందరికి పట్టాలు ఇచ్చే బాధ్యత తనదని, ఆదివారం నాటికి మొత్తం ఖాళీ చేయాలని తహసీల్దార్‌ ప్రసాద్‌ చెప్పారు. అధికారులు మాట్లాడుతుండగానే రెండు పొక్లెయిన్‌లు వచ్చి అక్కడ ఉన్న రోడ్లను చెల్లా చెదురు చేయడం ప్రారంభించాయి. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య, డివిజన్‌ కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకొని నిరుపేదలతో మాట్లాడారు. నిరుపేదలకు అన్యాయం చేయవద్దని కోరారు.

    మేం ఎక్కడ ఉండాలయ్యా..?

     

    ‘‘అయ్యా మేము రోజువారి కూలీ చేసుకుని జీవించే నిరుపేదలం. మాకు ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాం. వీధి దీపాలు, రహదారులు, చేతిపంపులు కూడా వేశారు. వర్షపు నీరు పల్లపు ప్రాంతాల్లో చేరడం వల్ల కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు, డోర్‌ నంబర్లు కూడా ఉన్నాయి. మేము తలదాచుకునేందుకు మాకు ఎక్కడా స్థలం కూడా లేదు. మా గుడిసెలు తొలగిస్తే మేము ఎక్కడ ఉండాలయ్యా’’ అంటూ సత్తెనపల్లి మండలం గుడిపూడి ఎస్టీ కాలనీ వాసులు ఆవేదన వెలిబుచ్చారు. 

    మోడల్‌ కాలనీగా అభివద్ధి చేసేందుకే...

     

    గుడిపూడి ఎస్టీ కాలనీని ఆదర్శంగా ఉండేలా అభివద్ధి చేసేందుకు అక్కడ వేసుకున్న గుడిసెలను తొలగించాలని రెండు నెలల నుంచి చెబుతున్నాం. ఇదిగో అదిగో అంటూ కాలయాపన జరిగింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో పాటు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో అభివద్ధి చేస్తాం. లే అవుట్‌ వేసి మౌలిక వసతులు కల్పిస్తాం. గుడిసెల తొలగింపు విషయంలో మా పై ఎవరి ఒత్తిళ్లు లేవు.

      –బీ.బీ.ఎస్‌.ప్రసాద్, తహసీల్దార్, సత్తెనపల్లి 

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top