పేదల పక్షాన పోరాడుతాం: పొంగులేటి

పేదల పక్షాన పోరాడుతాం: పొంగులేటి - Sakshi


కొత్తగూడెం : పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని ఆకాంక్షించిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గన్న కలలను సాకారం చేసేందుకు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన కొత్తగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా రైల్వే, సింగరేణి, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి  ప్రసంగించారు.



ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చిందనే విషయంపై ప్రజలు ఓ సారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ ఇప్పటివరకు కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే 386 ఇళ్లను నిర్మించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటని ఆయన టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు.



కేటీపీఎస్, సింగరేణి కాలుష్య ప్రభావిత ప్రాంతమైన కొత్తగూడెం ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెం - కొవ్వూరు రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. అలాగే కొత్తగూడెం - సత్తుపల్లి రైల్వేలైన్ పూర్తి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. తాను ఎంపీగా ఉన్న హయాంలోనే వీటిని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర కార్యదర్శి కొదమసింహం పాండురంగాచార్యులు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమాశ్రీధర్‌లు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top