దాసరి హోటల్ను చుట్టుముట్టిన పోలీసులు
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు రాజమండ్రిలో బస చేసిన హోటల్ను పోలీసులు చుట్టుముట్టారు. కాపు రిజర్వేషన్ల కోసం నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దంపతులను పరామర్శించేందుకు అష్టకష్టాలు పడి రాజమండ్రి వరకు చేరుకున్న ఆయనను.. బయటకు కదలనీయకుండా హోటల్ బయట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మార్గమధ్యంలో కూడా పలుమార్లు నందిగామ, ఇతర ప్రాంతాల్లో అడ్డుకోవడంతో ఖమ్మం, సత్తుపల్లి మీదుగా అటవీ మార్గంలో ప్రయాణించి తాను రాజమండ్రి చేరుకున్నానని, ఇక్కడేం చేస్తారో చూడాల్సి ఉందని అంతకుముందే దాసరి నారాయణరావు అనుమానం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి.. పోలీసు ఆంక్షల కారణంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి కారులో రావడానికే 12 గంటల సమయం పట్టిందని.. తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత ఆయన బస చేసిన హోటల్ను కూడా పోలీసులు చుట్టుముట్టి, ఆయనను బయటకు రానివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గమని పలువురు వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ సరిహద్దులలో అయినా కనీసం చెక్ చేసి పంపుతారేమో గానీ, ఇక్కడ మాత్రం ముద్రగడ పద్మనాభం వద్దకు ఎవరినీ పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.