ఎన్నారై కిడ్నాప్ కథ సుఖాంతం
రాజమండ్రి క్రైం: రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్నకు గురైన వ్యక్తిని చక్రవర్తిగా తేల్చారు. రాజమండ్రి నగరంలోని సోమాలమ్మ ఆలయం సమీపంలోని ఓ ఇంటీరియర్ డెకరేషన్ దుకాణం వద్ద ఉండగా బుధవారం సాయంత్రం చక్రవర్తిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారు. ఆ కారు నంబరు ప్రకారం కృష్ణా జిల్లా వైపు వెళ్తున్నట్లుగా గుర్తించిన రాజమండ్రి పోలీసులు అక్కడి పోలీసులను అలెర్ట్ చేశారు.
రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జిల్లాలోని నందివాడ వద్ద ఆ కారును అడ్డుకున్నారు. కారులో చక్రవర్తితో పాటు ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే, తాము చక్రవర్తిని కిడ్నాప్ చేయలేదని, డబ్బు వ్యవహారం మాట్లాడేందుకు తీసుకెళ్తున్నామని వారు పోలీసులకు తెలిపారు. తమకు ఉద్యోగం ఇప్పిస్తానని చక్రవర్తి డబ్బులు గుంజి, మోసం చేశాడని వారు పోలీసు విచారణలో వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.