నేడు సిటీ పరేడ్... హాజరు కానున్న ప్రధాని
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత నౌకాదళం విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వేదికగా తన పాటడాన్ని సగర్వంగా చాటిచెప్పేందుకు సంసిద్ధమవుతోంది. అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన (ఐఎఫ్ఆర్-2016)లో భాగంగా నౌకాదళ విన్యాసాలను ఆదివారం ఇక్కడ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు నిర్వహించే ఈ విన్యాసాలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్, ఏపీ సీఎం చంద్రబాబులతోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. దాదాపు లక్షన్నర మంది వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
నౌకాదళ ప్రదర్శనలో భాగంగా యుద్ధ నౌకల నుంచి సాహసోపేత విన్యాసాలను ప్రదర్శిస్తారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు నిర్వహిస్తారు. అనంతరం సిటీ పరేడ్ నిర్వహిస్తారు. ఐఎఫ్ఆర్లో పాల్గొంటున్న 51 దేశాల నౌకాదళాలతోపాటు కోస్టుగార్డు, ఏపీ పోలీస్ దళాలు బీచ్రోడ్డులో మార్చ్ఫాస్ట్ నిర్వహిస్తాయి. దేశ, విదేశీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నృత్య, ఇతర కళారూపాల కార్నివాల్.. పరేడ్లో ప్రత్యేక ఆకర్షణ. విన్యాసాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలు వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నంలో పలుచోట్ల ఎల్ఈడీ స్క్రీన్లతో పాటు సినిమా హాళ్లలో కూడా ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు.
సంబంధిత వార్తలు