న్యాయం చేయండి.. సారో!

న్యాయం చేయండి.. సారో!


జమ్మలమడుగు:

‘మా భూములు కొనుగోలు చేసే ముందు.. నష్టపోయిన రైతులకు సిమెంట్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని దాల్మియా యాజమాన్యం చెప్పింది. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉత్పత్తి కూడా అవుతోంది. యాజమాన్యం మాత్రం తమ వారికి ఉద్యోగాలు కాదు కదా, ఉపాధి అవకాశాలు కూడా చూపించడం లేదు’ అని మైలవరం మండలం నవాబుపేట గ్రామానికి చెందిన బాధితులు ఆర్డీవో కె.వినాయకం

ఎదుట వాపోయారు. సోమవారం ఆర్డీవో తన చాంబర్‌లో మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో దాదాపు 30 మంది రైతులు కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. యాజమాన్యం రైతుల వద్ద నుంచి భూములు తీసుకుని పరిహారం ఇచ్చిందే తప్ప, తమకు ఎలాంటి ఉపాధి చూపెట్టడం లేదని వారు పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో పని చేసేందుకు యాజమాన్యం ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను

తెచ్చుకుంటుందని, తమ వారికి మాత్రం అన్యాయం చేస్తోందని అన్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి యాజమాన్యం భూములు కొనుగోలు చేసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలంటే వారికి కూడా కష్టం అవుతుందని ఆయన పేర్కొన్నారు. భూములు కోల్పోయిన చాలా మందికి ఉద్యోగాలు గతంలో ఇస్తే వారు సక్రమంగా పని చేయడం లేదని, దీంతో తమ ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా తక్కువగా ఉందని, కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నామని యాజమాన్యం చెబుతోందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అలా కాకుండా యాజమాన్యంపై తిరుగుబాటు చేసి, పనులు చేయకుండా జీతాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అవకాశం ఏమైనా ఉంటే దాల్మియా యాజమాన్యంతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చేస్తామని ఆయన పేర్కొన్నారు.

నష్ట పరిహారం మంజూరులో అన్యాయం:

‘గ్రామ వీఆర్వో, కట్టుబడిఇంటింటికి వచ్చి మీకు మేలు జరుగుతుంది. సంతకాలు పెట్టండి. ఆర్డీవో, తహసీల్దార్‌.. మీతో మాట్లాడిన తర్వాతనే పరిహారం ఇస్తారని చెప్పడంతో సంతకాలు చేశాం. ప్రస్తుతం మాకు అన్యాయంజరిగింది’ అని జాతీయ రహదారికి భూములు, ఇళ్లు కోల్పోయిన వారు ఆర్డీవో ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణానికి సమీపంలో ఉన్న తమ భూములు, ఇళ్లు మంచి రేటు పలుకుతాయని.. అధికారులు మాత్రం తక్కువ రేటు పెట్టి తమ భూములకు నోటిఫికేషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు. తమ భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తారో అనే విషయాన్ని తమతో మాట్లాడకుండా అధికారులు నిర్ణయించడం ద్వారా తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రైతులతో ఆర్డీవో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన భూములకు న్యాయపరంగా రావాల్సిన నష్టపరిహారం ఇచ్చామన్నారు. మూడేళ్లకు చెందిన రిజిస్ట్రేషన్‌ విలువల ఆధారంగానే ఇటీవల నష్టపరిహారం అంచనా వేసి ఇచ్చామన్నారు. రైతులకు సంబంధించిన ఐదు ఎకరాల భూమి ముద్దనూరు రహదారిలో జాతీయ రహదారికి కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం తాను ఏమి చేయలేనని, మరో వారం రోజుల్లో జమ్మలమడుగు, ముద్దనూరు, బొందల కుంటలో నష్టపోయిన రైతులతో మాట్లాడి, వారి చెప్పిన అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరింత నష్టపరిహారం పెంచేలా చేయటానికి ప్రయత్నం చేస్తానన్నారు. అంతేకాకుండా పునరావాసం కింద అదనంగా వచ్చేలా చేస్తానని వివరించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top