లోకాయుక్తకు రిస్ట్ వాచీ ట్విస్ట్ !

లోకాయుక్తకు రిస్ట్ వాచీ ట్విస్ట్ !

సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించే అత్యంత ఖరీదైన ‘హ్యూబ్లోట్’ వాచ్ వ్యవహారం లోకాయుక్తకు చేరింది. రూ.50-70లక్షల విలువ చేసే వాచ్‌ను సీఎం సిద్ధరామయ్య తన ఆస్తుల్లో చూపకుండానే అఫిడవిట్‌ను దాఖలు చేశారంటూ మానవ హక్కుల రక్షణా సమితి కార్యకర్త రామమూర్తి గౌడ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. సీఎం ధరించే ఈ అత్యంత ఖరీదైన వాచ్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందిగా రామమూర్తి గౌడ లోకాయుక్తను కోరారు. ఇంత ఖరీదైన వాచ్‌కు సంబంధించిన వివరాలను 2015 మార్చి 31లో లోకాయుక్తకు అందజేసిన నివేదికలో పొందుపరచలేదు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి  విలువైన ఏ వస్తువును కొన్నా, లేదా ఆయనకు బహుమతిగా లభించినా అందుకు సంబంధించిన వివరాలను ఈ నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది.

 

కానీ ఈ వాచ్‌కు సంబంధించిన వివరాలు గత నివేదికలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పొందుపరచలేదు. ఇక లోకాయుక్తకు సీఎం సిద్ధరామయ్య అందజేసిన వివరాల ప్రకారం సీఎం సిద్ధరామయ్యకు వ్యవసాయం ద్వారా ఏడాదికి రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. వివిధ ప్రాంతాల్లో కొన్ని సంస్థలకు ఇచ్చిన కట్టడాలకు బాడుగ రూపంలో ఏడాదికి రూ. 38 లక్షల ఆదాయం లభిస్తుండగా, భార్య పార్వతి పేరిట బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్‌లకు ఏడాదకి రూ.1.25 లక్షల ఆదాయం వస్తోంది. ఇక ఈ నివేదికను సమర్పించే నాటికి ఇద్దరు కుమారులతో ఉన్న ఉమ్మడి కుటుంబానికి వ్యవసాయం ద్వారా ఏడాదికి రూ. 25 లక్షల ఆదాయం వస్తున్నట్లు వివరించారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top