ఉల్లిపాయల లోడు చోరీ
రావులపాలెం: తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం కేంద్రంలో ఉల్లిపాయల లోడు లారీని దుండగులు బుధవారం అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిశాకి చెందిన లక్ష్మణదర బీర అనే వ్యాపారి మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 373 ఉల్లి బస్తాలను కొనుగోలు చేశాడు. ఏలూరుకు చెందిన కర్రి నూకరాజు లారీని కిరాయికి మాట్లాడుకున్నాడు.
అర్ధరాత్రి 12 గంటలకు డ్రైవర్ గంటా రవితో కలసి లారీలో ఉల్లిపాయలతో భువనేశ్వర్కు బయలుదేరాడు. రాత్రి ఒంటిగంట సమయంలో లారీని రావులపాడు వద్ద జాతీయ రహదారి చెంతన గల ఒక హోటల్ ముందు నిలిపి టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. అరగంట తరువాత బయటకు వచ్చి చూసేసరికి లారీ మాయమైంది. బుధవారం ఉదయం దీనిపై నూకరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ పీవీ రమణ దర్యాప్తు చేస్తున్నారు.