చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి జైలు శిక్ష


రంగారెడ్డి :

చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నేరం రుజువైనందున సంవత్సరం జైలు శిక్షతోపాటు రూ.85వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 8వ స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ శుక్రవారం తీర్పు చెప్పారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన వనం సత్యనారాయణ అదే ప్రాంతానికి చెందిన మిర్యాల శ్రీహరి పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం 2015 ఏప్రిల్‌లో సత్యనారాయణ నుంచి శ్రీహరి రూ.70 వేలు అప్పుగా తీసుకొని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు.



గడువు ముగిసిన తర్వాత డబ్బు చెల్లించమని శ్రీహరిని కోరగా రూ.70వేలకు ఆంధ్రా బ్యాంక్‌ చౌటుప్పల్‌ బ్రాంచ్‌కు చెందిన చెక్కులను సత్యనారాయణ పేరిట జారీ చేశాడు. ఆ చెక్కును లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ కొత్తపేట బ్రాంచ్‌లో జమ చేయగా ఖాతాలో డబ్బులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ శ్రీహరి డబ్బులు చెల్లించకపోవడంతో సత్యనారాయణ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన 8వ స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ పై విధంగా తీర్పు చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top