వంద రోజుల ప్రణాళిక


విద్యుత్‌ సరఫరాలో లోపాలను సవరించేందుకు రూపకల్పన

ఊర్జా మిత్రా పథకాన్ని నల్లగొండ జిల్లాలోనే ప్రారంభించాలి

మార్చి నెలాఖరు నాటికి వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరు

విద్యుత్‌ బిల్లుల వసూళ్లలో తిప్పర్తి ఏఈకి చార్జి మెమో

విద్యుత్‌ శాఖ సమీక్ష సమావేశంలో సీఎండీ రఘుమారెడ్డి




నల్లగొండ : విద్యుత్‌ సరఫరాలో లోపాలను సవరిం చేందుకు వంద రోజుల ప్రణాళిక రూపొం దించుకోవాలని విద్యుత్‌శాఖ సీఎండీ రఘుమారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన విద్యుత్‌శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ సమస్యలపై అసెంబ్లీలో చర్చకు వచ్చిన సందర్భంలో స్పందించిన సీఎం కేసీఆర్‌ వంద రోజుల ప్రణాళికకు రూపకల్పన చేశారన్నారు. దీనిలో భాగంగా నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, అవసరమైన చోట కొత్త వాటిని ఏర్పాటు చేయాలని వేలాడుతున్న విద్యుత్‌ తీగలను పటిష్టం చేసేందుకు ఎస్టిమేట్లు సిద్ధం చేసి వంద రోజుల కార్యాచరణతో వాటిని పూర్తిచేయాలని సీఎండీ ఆదేశించారు. సీఎం కే సీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో తీసుకున్న కార్యక్రమం కావున అధికారులు వేగవంతంగా పనిచేయాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఊర్జామిత్ర పథకాన్ని నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా వినియోగదారుల మొబైల్‌ నంబర్లు, విద్యుత్‌ సర్వర్లకు అనుసంధానం చేసే ప్రక్రియ 52 శాతం పూర్తయిందన్నారు. రాష్ట్రంలో నల్లగొండ సర్కిల్‌ మొదటి స్థానంలో ఉన్నందున ఈ నెలాఖరులోగా మిగిలిన 31 శాతం లక్ష్యాన్ని పూర్తిచేయాలని తెలిపారు. కొత్త వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు, పెండింగ్‌లో ఉన్న వాటిని మార్చి 31 నాటికి మంజూరు చేయాలన్నారు.  విద్యుత్‌ బిల్లులు వందశాతం వసూలు చేయాలని డిసెంబర్‌లో 98 శాతమే వసూలు కావడం పట్ల అధికారులను  సీఎండీ మందలించారు. తిప్పర్తి మండలంలో విద్యుత్‌ బిల్లులు 82 శాతం మాత్రమే వసూలు కావడంతో సంబంధిత ఏఈకి చార్జి మెమో జారీ చేయాలని సీఎండీ ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్, ఎస్‌ఈ భిక్షపతి, గోవర్దన్, ఏఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top