పుష్కరాలకని వెళ్లి అనంతలోకాలకు..
బలరాంపేట(సంతకవిటి) : మండలంలో సిరిపురం పంచాయతీ బలరాంపేట గ్రామానికి చెందిన పిల్లా నాగేశ్వరరావు పుష్కరాల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదానికి బలైపోయారు. బలరాంపేట గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం... పిల్లా నాగేశ్వరరావు రెండు రోజుల కిందట కుటుంబ సభ్యులుతో కలిసి విజయవాడ వెళ్లారు. అక్కడే ఈ నెల 21న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు గుంటూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందారు.
ఈయన మరణంతో బలరాంపేటలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. నాగేశ్వరరావుతో పాటు ఆయన భార్య చిన్నమ్మడు, ఒక కుమార్తె, కుమారుడు కూడా పుష్కరాలకు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు కాగా ఇద్దరికి వివాహాలయ్యాయి. మరో కుమార్తెతో పాటు కుమారుడు ఉన్నారు. కుటుంబమంతా ఈయనపైనే ఆధారపడి ఉంది. ఈయన మృతితో కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ప్రభుత్వమే వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.