పెళ్లి చేసుకుని వెళ్తుండగా రోడ్డుప్రమాదం
బొబ్బిలి (విజయనగరం జిల్లా) : శనివారం రాత్రి బొబ్బిలిలో పెళ్లి చేసుకుని.. ఆదివారం ఉదయం కారులో ప్రయాణమైన నవదంపతులతో సహా బంధువులు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వివాహం అనంతరం ఆదివారం తెల్లవారుజామున పెళ్లి బృందం కారులో ప్రయాణమైంది. అయితే బొబ్బిలి శివార్లలో ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొని పెళ్లి కారు బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఎం. అప్పలనాయుడు(40) అక్కడికక్కడే మృతిచెందగా.. కారులో ఉన్న నవదంపతులతో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు రొంపెల్లి గ్రామానికి చెందినవాడుగా గుర్తించారు. గాయపడినవారిని బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.