ఇంతకీ... సార్ తిట్టిందెవరిని?
ఆ మాట అన్నది ఎవరిని? ఇపుడు ఉభయ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతల్లో జరుగుతున్న చర్చ ఇది. ఈ మధ్య విజయవాడలో పార్టీ ముఖ్యనేతను ఆ జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ జిల్లా పరిషత్ ఛైర్మన్ కలిశారు. తమకు దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో వీరు ప్రభుత్వ అధికారుల పనితీరు బాగా లేదని, తమకు సహకరించటం లేదని, తమకు పనులు కావటం లేదని, ప్రభుత్వం ఇంకా మంచి మంచి పనులు చేపట్టాలని ఏకరువు పెడుతున్నారు. తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని అందరూ కి తాబిస్తున్నారని చెప్పుకునే ఆ ముఖ్య నేతకు వీరి మాటలు రుచించలేదు. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వారిలో ఒకరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇక దయచేయండి అని కసురుకున్నారు. ఒకటి, రెండు పరుష పదాలను కూడా ఉపయోగించారట. ఇంతకు ఆయన ఆగ్రహం చెందటానికి కారణం ఏమిటని వారు ఆరా తీశారు. విజయవాడలోని ఒక షాపింగ్ మాల్ దగ్గర టీడీపీ నేత ఒకరి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేయవద్దని ఆ మాల్ నిర్వాహకులు సూచించారట.వారి మాట వినని పార్టీ నేత అధికార పార్టీ వారినే ఫ్లెక్సీ పెట్టొందంటారా అని హల్చల్ చేశారు. శ్రుతిమించి మీడియాకు ఎక్కడంతో ముఖ్య నేత ఆగ్రహంతో ఉన్నారు. ఆ సమయంలో ఈ నేతలు కలవటంతో వారిపై కస్సుబుస్సులాడారు. ఈ విషయం చర్చనీయాంశమైంది. ముఖ్యనేత మండిపడింది గోదావరి నేతలపైనా, ఫ్లెక్సీ బాబులపైనా అని తలలు బద్దలుగొట్టుకుంటున్నారట.