ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదు..
హైదరాబాద్ : అసెంబ్లీకి ఎప్పుడు వచ్చామన్నది కాదు.. ప్రజాసమస్యలపై ఎలా స్పందించామన్నదే ముఖ్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు వాయిదా పడిన అనంతరం ఆమె మీడియా వద్ద మాట్లాడారు. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై కేవలం ప్రకటన చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని రోజా అన్నారు. ఈ విషయంపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారని చెప్పారు. మనిషిని ఢీకొట్టి చంద్రబాబునాయుడు ఎలా తప్పించుకున్నారో అందరికీ తెలుసని అన్నారు.
పుష్కరాల వద్ద 'బాబుబలి' అనే సినిమా తీశారని దానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తే నారాయణ నిర్మాతగా వ్యవహరించారని చంద్రబాబునాయుడు హీరోగా నటించారని విమర్శించారు. సర్కారీ హత్యలకు సంతపాలు మాకు అవసరం లేదని చెప్పారు. పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగా కనిపించినట్లు టీడీపీ నేతలు మాటకు మాట చెప్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వనజాక్షి విషయం, రిషితేశ్వరీ ఆత్మహత్య ఘటన, పసిబిడ్డను ఎలుకలు కొరికి చంపడం వంటి అంశాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని చెప్పారు. నిజంగా నీవు గొప్పపనులు చేసి ఉంటే ప్రతిపక్షంలో పదేళ్లు ప్రజలు ఎందుకు కూర్చొబెడతారని చంద్రబాబును ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కు ప్రభుత్వం భయపడాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.